శ్రీశైలంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లోని నంద్యాల జిల్లా శ్రీశైలంలో కొలువైన శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. ఈ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున భక్తులకు వసతి గదులను నిర్మించేందుకు, శ్రీశైలం దేవస్థానం అభివృద్ధికి సహకరించేందుకు తాము సిద్దంగా ఉన్నామని తిరుమల తిరుపతి దేవస్థానం ఈఓ ధర్మారెడ్డి స్పష్టంచేశారు.
బ్రహ్మోత్సవాలకు టీటీడీ తరఫున భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ముందుగా ఆలయ రాజగోపురం వద్దకు చేరుకున్న టీటీడీ ఈఓ ధర్మారెడ్డికి చైర్మన్ రెడ్డివారి చక్రపాణిరెడ్డి ఆలయ ఈవో పెద్దిరాజు సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం అర్చకులు వేదపండితులు శాస్త్రోక్తంగా పట్టు వస్త్రాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి హారతులిచ్చారు.