” ఓం నమఃశివాయ.. అంటూ పంచాక్షరి మంత్రంతో దేశవ్యాప్తంగానే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు అత్యంత భక్తితో పరమేశ్వరుడిని వేడుకున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రసిద్ధ శ్రీశైలం., ద్రాక్షారామం, సామర్లకోట, పిఠాపురం, భీమవరం, బలివెల, అమరావతి.. ఇలా పలు చోట్ల శివాలయాలలో లక్షలాది భక్తులతో కోలాహలం నెలకొంది.
శ్రీశైలం క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగాయి. శుక్రవారం మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శ్రీశైలం ఆలయానికి భక్తులు పోటెత్తారు. స్వామి అమ్మవార్ల దర్శనానికి తెల్లవారుజాము నుంచే భక్తులు క్యూ లైన్లలో బారులు తీరారు. దైవ దర్శనానికి సుమారు 6-8; గంటల సమయం పట్టింది. శివనామస్మరణతో శ్రీశైలం ఆలయం మారుమ్రోగుతోంది.
కాగా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా శుక్రవారం స్వామి అమ్మవార్లు నందివాహనంపై భక్తులకు దర్శనమివ్వనున్నారు. సాయంత్రం నందివాహనంపై స్వామిఅమ్మవార్ల ఆలయ ప్రదక్షిణ, స్వామిఅమ్మవార్లకు ప్రభోత్సవం నిర్వహించారు.