‘వైసీపీ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ ఆ పార్టీకి గుడ్ బై చెప్పనున్నారా? జగన్ కోసం వైసీపీ ఏర్పడిన తొలినాళ్లలోనే మంత్రి పదవి త్యాగం చేసి వచ్చిన మొదటి బీసీ నేతగా పేరొందిన బోస్ … జగన్ వ్యవహారశైలి నచ్చక పార్టీని వీడాలని చూస్తున్నట్లు వైసీపీ వర్గాల నుంచే ప్రచారం సాగుతోంది..”
”వైసీపీ రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ ఆ పార్టీని వీడితే జగన్ కి రాజకీయంగా కోలుకోలేని దెబ్బే అని చెప్పవచ్చు..”
పార్టీలో ఇమడలేనంటూ.. ఇప్పటికే వైసీపీ ముఖ్యనేత , ఎంపీ మిదున్ రెడ్డికి బోస్ తెలిపినట్లు కూడా వినికిడి. రామచంద్రపురం అసెంబ్లీ స్తానం నుంచి 2024 లో బోస్ తనయుడు సూర్య ప్రకాష్ పోటీ చేస్తారంటూ ఇటీవల అక్కడ ఓ వర్గం సమావేశాలు పెట్టి ప్రకటించారు. ఈ వ్యవహారం జగన్ దృష్టికి వెళ్లడంతో , సమాచార, సినిమాటోగ్రఫీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణకే మళ్ళీ రామచంద్రపురం టికెట్ ఇస్తున్నట్లు జగన్ ప్రకటించారు. తనతో మాటమాత్రం చెప్పకుండా వేణు సీటు ఇప్పటికిప్పుడు ప్రకటించడంపై ఆగ్రహం చెందిన బోస్ వైసీపీని వీడాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
సుభాష్చంద్రబోస్ తన కుమారుడి రాజకీయ అరంగేట్రం కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ప్రాతినిథ్యం వహిస్తున్న రామచంద్రపురం నియోజకవర్గం నుంచి వచ్చే ఎన్నికల్లో ఆయన్నే అధిష్ఠానం తిరిగి అభ్యర్థిగా ప్రకటించనుండడంతో బోస్ తన రాజకీయ వ్యూహాలకు పదును పెడుతున్నారు. వేణుకు టిక్కెట్ ఇస్తే ఆయనపై స్వయంగా బోసే తిరుగుబాటు అభ్యర్థిగా బరిలోకి దిగుతారనే ప్రచారం కూడా జోరందుకుంది. అయితే తాజాగా … ఈ నిర్ణయం మార్చుకుని టీడీపీలో చేరాలని భావిస్తున్నారు.
పార్లమెంట్ సమావేశాల తర్వాత.. ఆగస్టు 15 దాటిన తర్వాత సుభాష్ చంద్రబోస్ పార్టీ మారే తేదీ ఖరారయ్యే అవకాశం కనిపిస్తోంది. ” మంత్రి వేణుని పిలిపిస్తా.. కూర్చుని మాట్లాడుకుని సమస్య పరిష్కరించుకుందాం..” అని సీఎం జగన్ చెప్పగా.. అతనితో నేను కూర్చోవడమా? కుదరదు..అంటూ బోస్ తెగేసి చెప్పినట్లు విశ్వసనీయ సమాచారం.
బోస్ టీడీపీలో చేరితే.. ఆయన తనయుడు సూర్యప్రకాష్ కి రామచంద్రపురం టికెట్ హామీ లభిస్తుంది. బోస్ బీసీ సామాజిక వర్గాలలో రాష్ట్రంలోనే అవినీతి మరక అంటని నేతగా పేరొందారు. బోస్ టీడీపీలో చేరితే ముక్యంగా కోస్తా ప్రాంతంలో బీసీ సామాజిక వర్గాలలో మెజార్టీ జనాన్ని టీడీపీకి మద్దతుగా నిలబెట్టగలుగుతారన్న అంచనాలు రాజకీయ వర్గాలలో నెలకొన్నాయి. జగన్ కి ముందునుంచీ అండగా నిలుస్తూ వచ్చిన నేతగా పేరొందిన బోస్ ని ఇటీవల జరిగిన బీసీ సభలో సైతం మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడంపై కూడా బీసీ వర్గాలలో తీవ్ర అసంతృప్తి నెలకొంది.