” పైన దేవుడు చూస్తున్నాడు..” అంటూ సీఎం జగన్ పదే పదే చెపుతూ ఉంటారు. జగన్ బాబాయ్ , మాజీ మంత్రి వివేకానంద్ రెడ్డి హత్య ను వెనుకుండి నడిపించిన వారు, ఆ హత్యను అప్పట్లో టీడీపీ ఖాతాలోకి నెట్టి 2019 ఎన్నికల్లో భారీ లబ్ది పొంది అధికారం కైవసం చేసుకోవడం ద్వారా జగన్ సీఎం అయ్యారు. వివేకాను టీడీపీ వాళ్లే చంపించి ఉంటే కేసు ఇన్నాళ్లూ ఉంటుందా? ప్రతిపక్ష నేతగా ఉన్నపుడు సీబీఐ దర్యాప్తు కోరిన జగన్, సీఎం అయ్యాక సీబీఐ దర్యాప్తు వద్దని ఎందుకు పట్టుపట్టారు?
వైఎస్ వివేకా కుమార్తె సునీత, ఆమె భర్త రాజశేఖర్ రెడ్డిలపై కూడా హత్య నెపాన్ని వేశారు. సాక్షి మీడియా ద్వారా వీరిపై బురద చల్లడం తెలిసిందే.
మాజీ మంత్రి, మాజీ ఎంపీ మర్డర్ కేసును సీబీఐ సైతం నాలుగేళ్లకు తేల్చలేకపోయిందంటే ప్రజాస్వామ్యం ఏ దిశకు వెళుతుంది. కేంద్రం పెద్దలు సాయం లేకుండా ఇన్నాళ్లు ఈ వ్యవహారం ఆలస్యం అవుతుందా..?
వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తు బాగోతం చూశాం. ఈ రోజుల్లో డబ్బు, రాజకీయ పలుకుబడి ఉంటే ఎవరినైనా హత్య చేయించి తప్పించుకోవచ్చునని రుజువవుతోంది. డాక్టర్ సునీత పట్టుదలగా ఈ కేసును పట్టించుకోకపోయి ఉంటే ఇప్పటికే కథ కంచికి చేరిపోయేది. తన తండ్రిని దారుణంగా హత్య చేయించిన వారిని చట్టం ముందు దోషులుగా నిలబెట్టడం కోసం ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి కేసును ముందుకు తీసుకువెళుతున్న డాక్టర్ సునీత భవిష్యత్తులో మరెందరికో ఆదర్శంగా, ఒక ప్రేరణగా మిగులుతారు. దేవుడు ఉన్నాడని జగన్మోహన్ రెడ్డితో పాటు మనం అందరం కూడా నమ్ముతాం కనుక వివేకా హత్య కేసులోని నిందితులు చట్టాల నుంచి తప్పించుకున్నప్పటికీ దేవుడి కోర్టులో శిక్షింపబడకుండా ఉండరు. మన దేశంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని ఇకపై ఎవరైనా అంటే కాసేపు నవ్వుకుందాం. హైకోర్టు ఆదేశాల మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ఆరంభించిన సీబీఐనే చివరికి చేతులు ఎత్తేయాల్సిన పరిస్థితి కల్పించిన పాలకులు చట్టాన్ని తన పని తనను చేసుకుపోనిస్తారా? రాజకీయ ప్రయోజనాల కోసం ఎవరి ఆట వారు ఆడటం ఈ దేశంలో పరిపాటిగా మారింది. అందుకే ఒక దివంగత ముఖ్యమంత్రి సోదరుడు వివేకానంద రెడ్డి హత్య జరిగినా ఆయనకు పుత్ర సమానుడైన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ సూత్రధారులు తప్పించుకోవడాన్ని ఏమనాలి..? జగన్ చెప్పినట్లు ఇవన్నీ దేవుడు చూస్తున్నాడు. ఖచ్చితంగా పాత్రధారులు, సూత్రదారులు తగిన సమయంలో శిక్ష వేస్తాడు.. అంటూ రాయలసీమలో సైతం చర్చించుకోవడం కొసమెరుపు.