” ఐదు వేల రూపాయలకు ఉద్యోగం చేస్తున్న వాలంటీర్లే జగన్ కి, వైసీపీకి అనుకూలంగా ఏమి చెపితే అది చేయడానికి సిద్దమవుతున్నారంటే వాళ్ళను జగన్ ప్రవైట్ సైన్యం అనడంలో ఆశ్చర్యం ఏముంది?”
జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే ఏర్పాటు చేసిన వలంటీర్ల వ్యవస్థ గ్రామాల్లో ప్రజలకు కొంతవరకు ఉపయోగపడుతున్నప్పటికీ… అనేక ఇతర విషయాలలో మాత్రం వివాదాస్పదమైంది. వలంటీర్లు ప్రభుత్వోద్యోగులా, అధికారపార్టీ కార్యకర్తలా అంటే చెప్పలేని పరిస్థితి. వలంటీర్లకు ప్రభుత్వ ఖజానా నుంచి నెలకు 5వేల గౌరవ భృతి చెల్లిస్తున్నారు. అంటే వారు ప్రజలకు జవాబుదారీగా ఉండాలి. కానీ, అలా జరగడం లేదు. ప్రభుత్వం నుంచి గౌరవభృతి పొందుతున్నప్పటికీ అత్యధిక వలంటీర్లు అధికార వైసీపీ కార్యకర్తలుగా మారిపోయారని చెప్పాలి. గ్రామాలు, పట్టణాలు అన్న తేడా లేకుండా ప్రజలకు సంబంధించిన సమస్త సమాచారం వలంటీర్ల వద్ద ఉంటోంది. వారి నుంచి ఆ సమాచారం అధికార పార్టీకి చేరుతోంది. రాష్ట్రంలో కొత్త ఓట్ల చేర్పు, ఉన్న ఓట్ల తొలగింపు ప్రస్తుతం వివాదాస్పదమై ఎన్నికల కమిషన్ జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. వలంటీర్ల ద్వారా సేకరించి పెట్టుకున్న సమాచారం ఆధారంగా ప్రతిపక్షాలకు అనుకూలంగా ఉండే ఓటర్లను జాబితా నుంచి తొలగిస్తున్నారన్న ఆరోపణలు బలంగా ఉన్నాయి. అదే సమయంలో ప్రతిపక్షాలకు అనుకూలంగా ఉండే ఓటర్లను అధికారపక్షం వైపు మళ్లించేందుకు వలంటీర్లు పథకాల ఆశ చూపుతున్నారని విమర్శలు వస్తున్నాయి.
ఈ నేపథ్యంలో వలంటీర్ల వ్యవస్థపై ప్రతిపక్షాలు సహజంగానే విమర్శలు చేస్తాయ్గు. స్థానిక సంస్థల ఎన్నికలలో ఓటర్లను వలంటీర్లు ప్రభావితం చేసినట్టు స్పష్టం కావడంతో రానున్న సాధారణ ఎన్నికలలో కూడా అదే జరిగితే ఎలా? అని ప్రతిపక్షాలు ఆందోళన చెందుతున్నాయి. ఈ క్రమంలోనే జనసేనాని పవన్ కల్యాణ్ వలంటీర్లపై విరుచుకుపడ్డారు. మహిళల అదృశ్యం వెనుక వలంటీర్ల హస్తం ఉందంటారా అని అధికార పార్టీ వాళ్లు వలంటీర్లను రెచ్చగొట్టారు. అధికార వైసీపీ ప్రోద్బలం, అండదండలతో వలంటీర్లు రాష్ట్రవ్యాప్తంగా పవన్ కల్యాణ్కు వ్యతిరేకంగా ఆందోళనలు చేశారు. పవన్ కల్యాణ్ దిష్టిబొమ్మలను దహనం చేయడమే కాకుండా ఆయన చిత్రపటాలను చెప్పులతో తొక్కారు. పవన్ కల్యాణ్ వ్యాఖ్యల్లో హేతుబద్ధత ఉందా? లేదా? అన్న విషయం పక్కనపెడితే ప్రభుత్వం నుంచి జీతం తీసుకుంటున్న వలంటీర్లు ఒక రాజకీయనాయకుడి పట్ల ఇలా వ్యవహరించవచ్చా? అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. వైసీపీ నాయకులతో కలిసి వలంటీర్లు ఆందోళన చేయడమేమిటనే విమర్శ కూడా ఉంది. తన వ్యాఖ్యలపై వలంటీర్ల నుంచి విమర్శలు రావడంతో పవన్ కల్యాణ్ కూడా గొంతు సవరించుకున్నారు. వలంటీర్లను అధికార పార్టీ ఎలా దుర్వినియోగం చేస్తున్నదీ చెప్పుకొచ్చారు. అధికార పార్టీ ఆజ్యం పోయడానికి ఎంతగా ప్రయత్నించినప్పటికీ వలంటీర్ల ఆందోళనలు మాత్రం పవన్ కల్యాణ్ క్షమాపణలు చెప్పకుండానే చల్లబడిపోయాయి. పవన్ కల్యాణ్ కాస్త తొందరపడి కామెంట్ చేసి ఉండవచ్చుకానీ, వలంటీర్ల వ్యవస్థలో మంచి చెడులు ఏపీ ప్రజలలో ఇప్పుడు చర్చకు వచ్చాయి. ”మరోమారు అధికారంలోకి వచ్చిన వెంటనే వలంటీర్ల జీతాలు 10 వేలకు పెంచుతామంటూ వైసీపీ నేతలు ఊరిస్తున్నారు. ఇది కూడా పవన్ వ్యాఖ్యలపై వాలంటీర్లు రెచ్చిపోవడానికి ఒక కారణంగా చెప్పవచ్చు.”