ప్రముఖ హీరోయిన్ నయనతార, విఘ్నేశ్ శివన్ దంపతులు వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.. అయితే వివాహానంతరం వారు తిరుమల వెంకన్నను దర్శించుకున్నారు. తిరుమల కొండపై శ్రీవారి ఆలయం చుట్టూ ఉన్న మాడ వీధుల్లో వారు తిరిగారు. ఆ సమయంలో విఘ్నేశ్ చెప్పులు విడిచి నడిచినా.. నయనతార మాత్రం చెప్పులతోనే మాడ వీధుల్లో తిరిగారట. అంతేకాకుండా శ్రీవారి ఆలయం ప్రధాన ద్వారానికి సమీపంలోనే వారు ఫొటో షూట్లో పాల్గొన్నారు. ఇలా తిరుమల పవిత్రతకు నయనతార దంపతులు భంగం కలిగించేలా వ్యవహరించిన తీరుపై విమర్శలు రేకెత్తుతున్నాయి.
అయితే ఈ వ్యవహారంపై తిరుమల తిరుపతి దేవస్థానం స్పందించింది. శ్రీవారి ఆలయం సమీపంలోనే నయనతార దంపతుల ఫొటోషూట్పై టీటీడీ ఆగ్రహం వ్యక్తం చేసింది. నయనతార కాళ్లకు చెప్పులతోనే మాడ వీధుల్లో సంచరించడం దురదృష్టకరమని వ్యాఖ్యానించింది. తిరుమల పవిత్రతకు భంగం కలిగేలా వ్యవహరించిన నయనతార దంపతులపై పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నామని టీటీడీ ప్రకటించింది. వారిపై ఏఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేయవచ్చన్న విషయంపై చర్చిస్తున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. అయితే మరో వైపు వారు ఫొటో షూట్ చేయడం.. నయనతార చెప్పులతో తిరిగే సమయంలో టీటీడీ అధికారులు ఏం చేశారనే విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి.