సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ, నిర్మాత నట్టి కుమార్ ఇటీవల కొంత కాలంగా ఒకరినొకరు తిట్టుకున్నారు. మీడియాలో అగ్గిమీద గుగ్గిలం అయ్యారు. చివరికి ఒకరిపై ఒకరు కేసులు కూడా పెట్టుకున్నారు. కాని ఇప్పుడు వారిద్దరూ‘‘ మేం ఫ్యామిలీ ఫ్రెండ్స్’’ అంటున్నారు. తమ మధ్య అపోహలు, అపార్థాలు సమసిపోయాయంటూ చేతులు కలుపుకున్నారు. ఎందుకు అలా? అసలేం జరిగింది. ‘మా ఇష్టం’ సినిమా విషయంలో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, నిర్మాత నట్టి కుమార్ మధ్య వివాదం తలెత్తింది. వర్మ రూపొందించిన ‘మా ఇష్టం’ సినిమా నట్టి ఎంటర్టయిన్ మెంట్స్ కు చెందిన నట్టి క్రాంతి కుమార్, నట్టి కరుణ… వర్మపై కోర్టును ఆశ్రయించారు. తమకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకుండా సినిమా విడుదల చేస్తున్నారని పిటిషన్ వేశారు. కోర్టు స్టే ద్వారా ‘మా ఇష్టం’ సినిమా విడుదలను కూడా అడ్డుకున్నారు.
తన లెటర్ హెడ్ ను కాపీ చేశారని, తన సంతకాన్ని కూడా ఫోర్జరీ చేశారని వర్మ గత నెలలో నట్టి క్రాంతి కుమార్, నట్టి కరుణలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే వర్మ, నట్టి కుమార్ మధ్య ఇటీవల చర్చలు జరిగాయి. ఆ చర్చల్లో వారిద్దరికీ రాజీ కుదిరింది. కొందరు వల్ల తమ మధ్య విభేదాలు తలెత్తాయని.. ఇప్పుడవన్నీ సమసిపోయాయని చెప్పుకొచ్చారు. అందుకే ఒకరిపై ఒకరు పెట్టుకున్న కేసులను కూడా వెనక్కి తీసుకుంటున్నామని నట్టి కుమార్ తెలిపారు. కొన్ని పరిస్థితుల వల్లే నట్టి కుటుంబంపై కేసు పెట్టాల్సి వచ్చిందని, అంతేతప్ప వారిపై తనకు ఎలాంటి వ్యతిరేకత లేదని రామ్ గోపాల్ వర్మ స్పష్టం చేశారు. నట్టి కుమార్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తమ మధ్య ఏర్పడిన అపార్థాలు, అపోహలు తొలగిపోయాయని ఇప్పుడు తాము ఫ్యామిలీ ఫ్రెండ్స్ అని పేర్కొన్నారు. సమసిపోయింది. ఇరువురి మధ్య సయోధ్య కుదిరింది. పరస్పరం నమోదు చేసుకున్న కేసులు వెనక్కి తీసుకుంటున్నట్టు వర్మ, నట్టికుమార్ సంయుక్తంగా ప్రకటించారు.