సాక్షాత్తూ దేశ ప్రధాని. అయన పాల్గొన్న సభకు భద్రతా ఏర్పాట్లు చేయడంలో తీవ్ర నిర్లక్ష్యం వహించారు ఆంధ్ర ప్రదేశ్ పోలీసులు. ఈ వ్యవహారంపై ప్రధాని కార్యాలయం, కీలక భద్రతా అధికారులు ఆగ్రహంగా ఉన్నారు. ఇలాంటి వాటిని ఉపేక్షిస్తే పోలీసు వ్యవస్థకు అత్యంత ప్రాధాన్యత ఉన్న నేతల భద్రతా వ్యవహారాలలో నిర్లక్ష్యం పెరిగిపోతుందని.. అది దేశానికీ మంచిది కాదన్న ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి.
చిలకలూరిపేట వద్ద జరిగిన “ప్రజాగళం” సభలో భద్రతా వైఫల్యానికి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ డిజిపిని, ప్రధానకార్యదర్శిని, జిల్లా అధికారులను ఎన్నికల కమీషన్ సంజాయిషీ కోరే అవకాశమైతే వుంది.
ఎన్నికల కోడ్ అమలులో వున్నప్పటికీ భారీ జనసందోహం వున్న సభలో భద్రత ఏర్పాట్లు చూడవలసిన బాధ్యత పోలీసుశాఖదే! ముఖ్యంగా హైసెక్యూరిటీ జోన్ లో వున్న దేశప్రధాన మంత్రి భద్రత కోసం అదనపు ఏర్పాట్లు చేసుకోవలసి వుంటుంది. జడ్ కేటగిరి సెక్యూరిటీలో లో వున్న చంద్రబాబు, జనం మీదపడిపోయే, స్టార్ పవన్ కళ్యాణ్ అదే వేదిక మీద వున్నారు. తెలుగుదేశం, జనసేన, బిజెపి అభిమానులు అదేసభలో వున్నారు. వివిఐపి గ్యాలరీని పోలీసు అధికారులే పర్యవేక్షించారు. పాస్ లు ఇచ్చారు. సభ జరుగుతుండగా ఒక గుంపు గ్యాలరీలోకి ఒక కెరటంలా దూసుకు రావడం టివిల్లో కనిపించింది. ప్రధానమంత్రికి కొద్ది అడుగుల దూరం వరకూ “అన్ ప్రిడిక్టెడ్ మాస్” వచ్చెయ్యడం భధ్రతా ఏర్పాట్లలో తీవ్రమైన వైఫల్యమని అర్ధం చేసుకోడానికి చట్టాలు, సెక్షన్లు అవసరం లేదు. కామన్ సెన్స్ చాలు.
ఎపి పోలీసులు తీరు – ప్రధాని భద్రతకు సవాలు
విద్యుత్ లైన్లకు సమీపంలో వున్న గడంచిల మీద కిక్కిరిసిపోయిన సభికులను దిగిరావాలని ప్రధాని పదేపదే చెప్పవలసిన పరిస్ధితికి బాధ్యులు, నియంత్రణ వ్యవస్ధ లేని పోలీసు యంత్రాంగమే కారణం కాదా?
ప్రధాని మాట్లాడే సభకు పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్ (మైక్) ను ఎన్నికల కోడ్ వున్నపుడు కూడా ప్రభుత్వ రేడియో ఇంజనీరింగ్ శాఖ సమకూర్చేది. కాలక్రమంలో నిర్వహకులే మైక్ లను సమకూర్చు కుంటున్నారు. వాటిని కూడా పోలీసులే తనిఖీ చేయాలి. అది సాంకేతిక విషయం కాబట్టి రేడియో ఇంజనీరింగ్ శాఖ పరిశీలన తరువాతే అనుమతి ఇవ్వాలి. ఈ పరిశీలనకూడా జరగలేదని మైక్ వైఫల్యాన్ని బట్టి అర్ధమౌతోంది.
ఆచరణాత్మకంగా చూసినపుడు ప్రధాని భద్రతా వైఫల్యంపై పోలీసుల మీద చర్యలకు అవకాశం తక్కువ. ఎన్నికల కాలంలో పోలీసుతో తగాదా ఎందుకని బిజిపి, తెలుగుదేశం, జనసేన పార్టీలు భావించడం సహజమే! కనుక వారెవరూ ఫిర్యాదు చేయరు. ఏ మాత్రం తీరికలేని ఎలక్షన్ కమీషన్ తనకుతానుగా ఇది పట్టించుకునే అవకాశం దాదాపు శూన్యం!
జగన్మోహన్ రెడ్డి అదుపాజ్ఞల్లో వున్న పోలీసులు ప్రధాని భద్రతను కూడా పట్టించుకోలేదని పోలింగ్ ముందురోజువరకూ విమర్శించడానికి మాత్రం ఆయన ప్రత్యర్ధులు ఈ సంఘటనను ఎడా పెడా వాడేస్తూంటారు
ఈ వైఫల్యాలకు ముఖ్యమంత్రి జగన్ మోహన రెడ్డిని బాధ్యుడిగా చేయడం కరెక్టు కాదు. కాకపోతే ఆయన ఐదేళ్ళకాలంలో పోలీసుశాఖ, జిల్లా కలెక్టర్ ఆధీనంలో పనిచేసే ప్రభుత్వ శాఖలు తమ విధులను, బాధ్యతలను స్వతంత్ర అధికారాలను మరచిపోయి ముఖ్యమంత్రి కార్యాలయం ఆదేశాలు అమలు చేయడానికి పరిమితమైపోయి పనిపడేటప్పటికి ఉత్సవ మూర్తులుగా గడ్డకట్టిపోయాయని ఖచ్చితంగా చెప్పవచ్చు.