పాడేరు మోదకొండమ్మ ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు ఈ వేడుకలు జరుపుతారు. ఏజెన్సీ చుట్టు పక్కల రాష్ట్రాల నుంచి ఆదివాసీలు అధిక సంఖ్యలో తరలివచ్చి మోదకొండమ్మను దర్శించుకుంటారు. దేశంలోనే చెప్పుకోతగ్గ గిరిజన పండుగ ఇది. అన్ని తెగల ఆదివాసీలు అమ్మవారికి పూజలు చేస్తారు. మోదకొండమ్మ అంటే గిరిజనులకు ఎంతో విశ్వాసం. విశాఖ ఏజెన్సీతో పాటు విజయనగరం శ్రీకాకుళం విశాఖపట్నం, ఉభయగోదావరి జిల్లాలతోపాటు దండకారుణ్యం నుంచి అధిక సంఖ్యలో అమ్మవారిని దర్శించుకునేందుకు వస్తుంటారు. ప్రతి ఏటా మే నెలలో భారీ ఏర్పాట్లతో ఈ ఉత్సవాలు నిర్వహిస్తుంటారు. ఈ ఏడాది మే 15 16 17 తేదీల్లో మోదకొండమ్మ ఉత్సవాలు జరుపుకునేందుకు గిరిజన పెద్దలు నిశ్చయించారు.
మోదకొండమ్మ చరిత్ర ..
పాడేరులో కొలువైన మోదకొండమ్మ జన్మస్థలం ఘాట్ రోడ్డులోని దట్టమైన అడవుల మధ్య ఉందని పూర్వీకులు చెప్పేవారు. ఒడిశా రాష్ట్రం నందాపురం రాజ్యానికి చెందిన మహారాణి, మాకలశక్తి, భైరవుడు దంపతుల ఏడుగురు సంతానంలో పెద్దకుమార్తెను మోదకొండమ్మగా చెప్పుకుంటారు. ఆమె మిగతా ఆరుగురు చెల్లెళ్లు కూడా మన్యంలోని వివిధ ప్రాంతాల్లో దేవతామూర్తులుగా వెలిశారని గిరిజనులు చెబుతారు. వారిలో మోదకొండమ్మ పెద్దక్క కాగా, చెల్లెలు కోవామలమ్మ పాడేరు మండలం వంట్లమామిడివద్ద ఘాట్ రోడ్లో వెలసింది. అలాగే జీకే వీధి మండలంలో దారాలమ్మ, జి.మాడుగుల మండలం కొత్తపల్లిలో మావుళ్లమ్మ, బొడకొండమ్మచింతపల్లి ఘాట్లో కూటికొండమ్మ, అలాగే వి.మాడుగుల మండలం కింతలి ప్రాంతంలో మరో తల్లి కొలువయ్యారు. మోదకొండమ్మతో పాటు ఆయా ప్రాంతాల్లో ఉన్న ఆరుగురు చెల్లెళ్లూ దేవతామూర్తులుగా కొలువై పూజలు అందుకుంటున్నారు. అయితే మోదకొండమ్మ పెద్ద కావడంతో మోదకొండమ్మకు ప్రత్యేక ప్రాధాన్యం ఏర్పడింది. తల్లిని మొక్కు కుంటే కోరిన కోర్కెలు కచ్చితంగా తీరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం
ఆలయ నిర్మాణం.. ఉత్సవాలు..
పాడేరు 15 కిలోమీటర్ల దూరంలో ప్రస్తుతం మోదకొండమ్మ పాదాలు ఉన్న ప్రాంతంలోనే పూర్వం ఒక చిన్న గుడిని నిర్మించారు. చుట్టుపక్కల ప్రాంత ప్రజలంతా అక్కడికే నడుచుకుంటూ వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించేవారు. మోదకొండమ్మ జన్మదినమైన మే 12న ఉత్సవాలు నిర్వహించేందుకు స్థానికుడైన వెయ్యకుల వెంకటరావు 1970లో శ్రీకారం చుట్టారు. అమ్మవారి పాదాలు ఉన్న ప్రాంతం వద్ద పూజలు నిర్వహించి, పాడేరులో ఉత్సాహం నిర్వహిస్తే బాగుంటుందనే భావనతో అప్పటి నుంచి పాడేరులోనే ఉత్సవాన్ని జరుపుకుంటున్నారు. 1985 వరకు కొంతమంది దాతల సహకారంతో ఆయనే మోదకొండమ్మ ఉత్సవాలు నిర్వహించేవారు. తర్వాత అక్కడే మోదకొండమ్మ ఆలయం నిర్మించాలని అప్పటి తహసీల్దార్ జమ్మలమడుగు దాశరధిశర్మ స్థానిక పెద్దలతో చర్చించారు. రెవెన్యూ అధికారి ఉమామహేశ్వర పాత్రుడు ఆలయం నిర్మాణానికి స్థలాన్ని దానం చేశారు. అలా 1985లో ఆలయ నిర్మాణం, మోదకొండమ్మ విగ్రహ ప్రతిష్ఠాపన జరిగింది. గిరిజనులే కాకుండా ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి జిల్లాలు, ఒడిసా, చత్తీస్ ఘడ్ రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తరలి వచ్చిఅమ్మవారిని దర్శించుకుంటారు.
నేటి నుంచి మూడు రోజుల పాటు జాతర
మోదకొండమ్మ మహోత్సవాలు సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున అల్లూరి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఈ రోజు అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. వేకువ జామున ఐదున్నర గంటలకే సాంప్రదాయ దుస్తుల్లో గుడికి చేరుకున్న కలెక్టర్ స్థానిక పాడేరు శాసనసభ్యురాలు కొట్లగుళ్లి భాగ్యలక్ష్మి, ఐటీడీఏ పీవో రోణంకి గోపాలకృష్ణ, సబ్ కలెక్టర్ వి.అభిషేక్ సమక్షంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం, అమ్మవారి ఉత్సవ విగ్రహాలను, ఘటాలను శతకం బొట్టు సన్నిధికి ఊరేగింపుగా తీసుకు వెళ్లారు. మూడు రోజులపాటు ఉత్సవ విగ్రహాలు, ఘటాలకు అక్కడ పూజలు నిర్వహించి తిరిగి అమ్మవారి గుడికి చేరుస్తారు.