అల్లూరి సీతారామరాజు జిల్లాలోని మారుమూల ప్రాంతాలు తాగునీటికి కటకటలాడుతున్నాయి. గుక్కెడు నీళ్లకోసం ఆదివాసీలు అలమటిస్తున్నారు. వేసవి కావడంతో గిరిజనులకు చెలమల నీరే ఆధారం. కొండలపై నుంచి ప్రవహించే నీటినే తాగుతారు. అది కలుషితమై తీవ్రఅనారోగ్యాలకు గురవుతున్నారు. పంచాయతీలలో నిధులు లేకపోవడంతో దాదాపు అన్ని గ్రామాలలో తాగునీటి పథకాలకు మరమ్మతులు లేవు. చాలా గ్రామలలో చేతిపంపులు, పైపులైన్లు మరమ్మతులకు గురయ్యాయి. అనంతగిరి మండలం బొర్రా పంచాయతీ గేటువలస గ్రామంలో తీవ్రనీటి ఎద్దడి ఏర్పడింది. బొర్రా పంచాయతీలో 14 గ్రామలు ఉన్నాయి. కొన్నిరోజులుగా తాగునీటి కష్టాలు ప్రారంభమయ్యాయి. దీంతో ఆదివాసీలు నీరు రాక కిల్లోమీటర్ల దూరం వెళ్లి గెడ్డ నీరు తెచ్చుకోవాలసిన పరిస్థితి ఏర్పడింది.
గ్రావిటీ సోర్స్ ఉన్న చోట కుండీ పూర్తిగా బీటలు వారి శిథిలావస్థకు చేరింది. దీంతో నీరు ఇంకిపోయి గ్రావిటీ ద్వారా గ్రామానికి నీరు అందడం లేదు. అలాగే అరకు మండలంలోని మాదల పంచాయతీ దాబగూడ గ్రామంలో తాగునీటి సౌకర్యం లేదు.. దీంతో ఆ గ్రామస్థులకు కలుషితమైన ఊట గడ్డ నీరే ఆధారం. కలుషితమైన నీటిని తాగడం వల్ల వివిధ రకాల వ్యాధుల బారిన పడుతున్నారు గిరిజనులు. ఆ గ్రామంలో సుమారు 50 కుటుంబాలు ఉండగా, 200 మంది జనాభా ఉన్నారు. ఇప్పటి వరకు సాగునీటి సౌకర్యం కల్పనకు ఎటువంటి చర్యలు తీసుకోవడంలేదు. ఇలా అనేక ఆదివాసీ గ్రామాల ప్రజలు తాగునీటికి కటకటలాడుతున్నారు.