చాలాకాలంగా టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఉప్పు-నిప్పులా వ్యవహరిస్తున్నప్రముఖ సినీ నటుడు, మాజీ ఎంపీ మంచు మోహన్బాబు, తన కుమార్తె లక్ష్మీ ప్రసన్నతో కలిసి మంగళవారం చంద్రబాబును కలిశారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని చంద్రబాబు నివాసానికి వెళ్లిన మోహన్బాబు ఆయనతో గంటకు పైగా చర్చలు జరిపారు. వీరిద్దరి భేటీ అటు చిత్రపరిశ్రమతోపాటు ఇటు రాజకీయ వర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారింది.
ఎందుకంటే మోహన్బాబు కుటుంబం చాలాకాలంగా వైఎస్ కుటుంబానికి సన్నిహితంగా ఉంటోంది. ఆ కుటుంబంతో బంధుత్వం కూడా ఉంది. గతంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో తనకు చెందిన శ్రీవిద్యానికేతన్ విద్యాసంస్థల్లో చదువుకుంటున్న విద్యార్థులకు ఫీజు రీఇంబర్స్మెంట్ సొమ్ము చెల్లించలేదంటూ మోహన్బాబు రోడ్డెక్కి విద్యార్థులతో కలిసి ధర్నాలు, రాస్తారొకోలు చేశారు. ఆ సమయంలో సీఎంగా ఉన్న చంద్రబాబునాయుడిపై ఘాటుగా విమర్శలు గుప్పించారు. దాంతో వారిద్దరి మధ్య దూరం పెరిగింది.
ఇక వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక మోహన్బాబు ఆయనతో సన్నిహితంగానే ఉంటున్నారు. ఆయనకు రాజ్యసభ సభ్యత్వం గానీ లేదా టీటీడీ పదవి కాని లభిస్తుందని చాలామంది భావించారు. అయితే ఇవేమీ జరగలేదు. ఫీజు రీయింబర్స్మెంట్ సొమ్ము విషయంలోనూ మోహన్బాబు బాహాటంగానే తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో చాలాకాలం తరువాత ఆయన చంద్రబాబును కలవడం ఆసక్తికరంగా మారింది. ఆయన తిరిగి టీడీపీకి దగ్గరయ్యే ప్రయత్నాల్లో ఉన్నారా .. అనే చర్చ జరుగుతోంది. నిజానికి మోహన్బాబుపై టీడీపీ వర్గాల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. ఆయనను పార్టీలో చేర్చుకుంటే క్యాడర్ ఆహ్వానించే పరిస్థితి లేదనే చెప్పాలి. మరి వీరిద్దరి మధ్య ఏ అంశంపై చర్చలు జరిగాయో ఇంకా వెల్లడి కావాల్సి ఉంది.