చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ఫిల్మ్ చాంబర్లో జరిపిన చర్చల్లో తెలుగు సినీ నిర్మాతల మండలి కీలక నిర్ణయం తీసుకుంది. భారీ చిత్రాల విషయంలో థియేటర్లో విడుదలైన పదివారాల తర్వాతే ఓటీటీలో ప్రదర్శించేందుకు హక్కులు ఇవ్వాలని నిర్ణయించింది. కోవిడ్ పాండమిక్ తరువాత చిత్ర పరిశ్రమ సంక్షోభం ఎదుర్కొన్న నేపథ్యంలో పరిశ్రమను కాపాడుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలపై నిర్ణయించేదాకా ఆగస్టు ఒకటో తేదీ నుంచి షూటింగ్లను నిలిపివేయాలని నిర్మాతల మండలి ఇప్పటికే పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.
దీనిపై తుది నిర్ణయం తీసుకునేందుకు ఫిల్మ్ చాంబర్లో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు సమావేశం కాగా, ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కమిటీకి తుది నిర్ణయం తీసుకునే బాధ్యతను అప్పగించారు. కాగా కార్యవర్గ సమావేశంలో చర్చించిన 8 ప్రధాన అంశాలకు సంబంధించి నిర్మాతలు కీలక నిర్ణయం తీసుకున్నారు. భారీ బడ్జెట్తో తెరకెక్కే సినిమాలను 10 వారాల తర్వాత, లో బడ్జెట్ చిత్రాలనైతే 4 వారాల తర్వాత మాత్రమే ఓటీటీకి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. రూ.6 కోట్లలోపు బడ్జెట్ చిత్రాలపై ఫెడరేషన్తో చర్చించాక నిర్ణయం తీసుకోవాలి.
ఇక నటులు, సాంకేతిక నిపుణుల సమస్యలపైనా చర్చలు జరిపారు. ఎవరైనా సమయపాలన పాటించి తీరాలని, షూటింగ్లో అనవసర వ్యయాలను తగ్గించాలని నిర్ణయించారు. తమ సహాయకులకు వసతి, ఇతర సౌకర్యాలు కావాలని నటీనటులు కోరేందుకు అనుమతించరు. వారి పారితోషికం నుంచే వ్యక్తిగత సిబ్బందికి చెల్లించాల్సి ఉంటుంది. పతి నిర్మాత ఛాంబర్, కౌన్సిల్ నియమ, నిబంధనలు పాటించాలని, ఫిల్మ్ ఛాంబర్ నిర్మాతల మండలితో చర్చించాకే సినిమాలకు సంబంధించి నిర్మాణ వ్యయాలు పెంచుకోవాలని నిర్ణయించారు.
సినిమా టికెట్ ధరలు మరీ అధికంగా కాకుండా సామాన్యులకు అందుబాటులో ఉంచాలని తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ప్రతిపాదించింది. నగరాలు, పట్టణాల్లో మామూలు థియేటర్లు, సి–క్లాస్ సెంటర్లలో టికెట్ ధరలు రూ.100, రూ.70 గా ఉంచాలని పేర్కొన్నారు. మల్టీప్లెక్స్లో జీఎస్టీతో కలిపి రూ.125 ఉండేలా ప్రతిపాదించారు. మీడియం బడ్జెట్, మీడియం హీరో సినిమాలకు టికెట్ ధరలు నగరాల్లో రూ.100 ప్లస్ జీఎస్టీ ఉండాలని, అదే సి–సెంటర్లలో జీఎస్టీతో కలిపి రూ.100 ఉండాలని, మల్టీప్లెక్స్లో అత్యధికంగా రూ.150 ప్లస్ జీఎస్టీతో మాత్రమే ఉండాలని నిర్ణయించారు. నిర్మాతలను తప్పుదోవ పట్టిస్తున్న మేనేజర్లు, కో–ఆర్డినేటర్ల వ్యవస్థను రద్దు చేయాలని తీర్మానించారు. సినిమా ప్రదర్శనకు వీపీఎఫ్ ఛార్జీలు ఎగ్జిబిటర్లే చెల్లించేలా నిర్ణయించారు.