ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అత్యధిక కాలం పరిపాలించిన ఘనత నారా చంద్రబాబునాయుడికే దక్కుతుంది. అభివృద్ధి ప్రధాన అజెండాగా పని చేసిన ఆయన హయాంలోనే హైదరాబాద్ భవిష్యత్తులో అంతర్జాతీయ నగరంగా ఎదిగేందుకు బలమైన పునాది పడింది. ఆయన మూడు దశాబ్దాలకు పైగా ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం కుప్పం. చంద్రబాబునాయుడు సొంతగ్రామం నారావారిపల్లె నిజానికి చిత్తూరు జిల్లా చంద్రగిరిలో ఉంది. ఆ నియోజకవర్గం నుంచే ఆయన రాజకీయ ఆరంగేట్రం చేశారు.
1978లో చంద్రగిరి నుంచే ఇందిరా కాంగ్రెస్ పార్టీ నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా ఆయన పోటీ చేసి గెలిచారు. అంజయ్య మంత్రివర్గంలో సినిమాటోగ్రఫీ మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వహించారు. ఆ సమయంలోనే ఆయనకు ఎన్టీఆర్ కుమార్తె భువనేశ్వరితో వివాహం జరిగింది. ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపించి 1983 ఎన్నికల్లో పోటీ చేసినప్పటికీ చంద్రబాబు కాంగ్రెస్ పార్టీ తరపునే పోటీ చేసి టీడీపీ అభ్యర్థి చేతిలో పరాజయం పొందారు. ఆ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ సంచలన విజయం సాధించి అధికారంలోకి వచ్చింది.
ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక టీడీపీలో చేరిన చంద్రబాబు చంద్రగిరిని వదలి అదే జిల్లాలోని కుప్పం నియోజకవర్గాన్ని తన రాజకీయ కార్యస్థలిగా ఎంచుకున్నారు. ఇక అప్పటినుంచి కుప్పం చంద్రబాబుకు విజయ హారతులు పడుతూనే ఉంది. అప్పటిదాకా అభివృద్ధిలో వెనుకబడిన ఆ నియోజకవర్గాన్ని అన్నివిధాలుగాను అభివృద్ధి పథాన నడిపిస్తూ ఆయన తనకు కంచుకోటగా మలుచుకున్నారు. వర్షపాతం తక్కువగా ఉండే ఆ నియోజకవర్గంలో ఇజ్రాయెల్ తరహా సాగు విధానాన్ని అమలుచేసి ఆ ప్రాంత రూపురేఖలు మార్చారు. 1989 నుంచి చంద్రబాబుకు అక్కడ ఎదురేలేదు. వరుసగా ఏడుసార్లు గెలిచి రికార్డు సృష్టించారు. కుప్పంలో చంద్రబాబుకు వచ్చే భారీ మెజారిటీతోనే చిత్తూరు ఎంపీ స్థానాన్ని కూడా పలుసార్లు టీడీపీ దక్కించుకుంటూ వచ్చింది.
అయితే 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాక పరిస్థితి మారింది. కుప్పం కోటను ఎలాగైనా బద్దలుకొట్టాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి గట్టి పట్టుదలతో ప్రయత్నిస్తున్నారు. ఆ జిల్లాకు చెందిన వైసీపీ ప్రముఖ నాయకులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సహా పలువురు నేతలుఇందుకు శతవిధాల తమవంతు సహకరిస్తున్నారు. గత స్థానిక సంస్థల ఎన్నికల్లో కుప్పం మునిసిపాలిటీని గెలుచుకోవడం ద్వారా వైసీపీ తన లక్ష్యంలో కొంత ముందంజ వేసిందనే చెప్పాలి. అయితే అధికారం అండగా వైసీపీ సామదానాభేద దండోపాయాలన్నింటినీ వినియోగించి ఆ ఎన్నికలను అక్రమంగా గెలిచిందని స్థానిక టీడీపీ నేతల నుంచి ఆరోపణలు వెల్లువెత్తాయి.
కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబునాయుడిపై ప్రజల్లో అభిమానం ఎంతమాత్రం చెక్కుచెదరలేదని, అసెంబ్లీ ఎన్నికల్లో తమ అధినేత మరోసారి ఇక్కడినుంచి ఘనవిజయం సాధించడం ఖాయమని టీడీపీ నేతలు గట్టి విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు. స్థానిక సంస్థల ఫలితాలు ఎలా ఉన్నా అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఇక్కడ చంద్రబాబు విజయాన్ని అడ్డుకోవడం అంత తేలిక కాదన్నదే రాజకీయ వర్గాల విశ్లేషణ..