మహానాడు ఊహించని స్థాయిలో విజయవంతం కావడంతో మంచి జోష్ మీదున్న టీడీపీ వర్గాలకు పార్టీ అధికార ప్రతినిధి, సినీ నటి దివ్యవాణి ఎపిసోడ్ ఓ చిన్నపాటి షాక్ ఇచ్చిందని చెప్పాలి. ఆమె తనకు పార్టీ తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదని, మహానాడులో మాట్లాడేందుకు కూడా అవకాశం ఇవ్వలేదని చెపుతూ టీడీపీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఆ తరువాత పార్టీ నేతలు ఆమెతో మాట్లాడటంతో ఆ నిర్ణయాన్ని వెనక్కుతీసుకుంటున్నట్టు తెలిపారు. సోషల్ మీడియాలో వచ్చిన నకిలీ పోస్టు చూసి పొరపడి ట్వీట్ పెట్టానని దివ్యవాణి తెలిపారు.
దివ్యవాణి బుధవారం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడుని కలిశారు. అనంతరంఆమె మీడియాతో మాట్లాడుతూ.. పార్టీలో తాను ఎదుర్కొన్న ఇబ్బందులను పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిపారు. ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్టు వచ్చిన ఫేక్ ప్రచారాన్ని నమ్మి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని ఆయన తనకు సూచించారని దివ్యవాణి తెలిపారు. కాగా తనపై విమర్శలు, విశ్లేషణలు చేసిన వారందరికీ కృతజ్ఞతలు చెపుతున్నానంటూ చెప్పిన ఆమె, తనకు రాజకీయం తెలియదని వ్యాఖ్యానించిన వారికి కూడా ధన్యవాదాలు అంటూ వ్యంగ్య బాణాలు విసిరారు.
ఇంతకీ పార్టీకి ఆమెకు వివాదం ఎక్కడ..?
దివ్యవాణి గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీలో చేరారు. రాష్ట్ర పరిస్థితులపై అవగాహనతోపాటు మంచి వక్తగానూ పేరుతెచ్చుకున్నారు. ఈ నేపథ్యంలోనే పార్టీ అధికార ప్రతినిధిగానూ ఆమెను నియమించారు. అయితే మహానాడు ముగిశాక ఓ యూ ట్యూబ్ చానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో దివ్యవాణి మాట్లాడుతూ తనకు మహానాడులో ఘోర అవమానం జరిగిందని, తనకు ఏమాత్రం ప్రాధాన్యత లభించలేదని, తాను మాట్లాడటం రాని వ్యక్తిని కాదని ఆక్రోశం వ్యక్తం చేశారు. పార్టీకి తాను నిస్వార్థంగా సేవలు అందిస్తూ వచ్చానన్నారు. పార్టీలో తనకు ఎలాంటి సమాచారం ఉండటం లేదని వ్యాఖ్యానించారు. అంతేకాకుండా సీఎం వైఎస్ జగన్ సహా వైసీపీ నేతలతో తనకు వ్యక్తిగతంగా ఎలాంటి గొడవలు లేవని కూడా దివ్యవాణి చెప్పారు.
ఆ తరువాత తాను టీడీపీకి రాజీనామా చేస్తున్నట్టు దివ్యవాణి ట్వీట్ చేశారు. అయితే కొన్నిగంటల్లోనే దానిని డిలిట్ చేశారు. ఆ తరువాత ఆమె చంద్రబాబును కలవడం ద్వారా తాను టీడీపీలోనే కొనసాగుతున్నట్టు స్పష్టం చేశారు. అయితే మహానాడు విజయం అనంతరం జరిగిన దివ్యవాణి రాజీనామా ఉదంతానికి మీడియాలో కాస్త ఎక్కువగానే ప్రచారం లభించింది. ఒకవేళ సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారాన్ని నమ్మి రాజీనామా ప్రకటన చేసినట్టు ఆమె చెప్పిందే నిజమైతే అది నిజమో కాదో నిర్ధారించుకోలేనంతగా పార్టీతో ఆమెకు అంత గ్యాప్ ఎందుకు వచ్చిందన్నది చాలామందికి అర్థంకాని ప్రశ్నగా మారింది. పార్టీలో దుష్ట శక్తులు అంటూ ఆమె విమర్శించింది ఎవరిననే ప్రశ్నలూ తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఉద్దేశపూర్వకంగానే ఆమె విమర్శలు చేశారంటూ టీడీపీ వర్గాల్లో ఆమెపై ఆగ్రహం కూడా వ్యక్తమైంది. ఫేక్ ప్రచారాన్ని నమ్మి నాయకులు ఇలా పార్టీకి ఇబ్బందికలిగిస్తే ఇకపై ప్రత్యర్థులు మరింత ఉధృతంగా సాగించే ఇలాంటి అసత్య ప్రచారాలను ఎలా ఎదుర్కోగలరన్న వాదననూ పలువురు టీడీపీ కార్యకర్తలు లేవనెత్తుతున్నారు.