తెలుగు పాపులర్ స్టార్ హీరో చిరంజీవి రాజకీయాలలోకి పునఃప్రవేశం చేయనున్నారా? తమ్ముడు పవన్ పెట్టిన జనసేనలోకి త్వరలోనే ఎంట్రీ ఇవ్వనున్నారా?
మెగా స్టార్ చిరంజీవి ఇటీవల చేసిన వ్యాఖ్యలు రాజకీయ, సినీ రంగాల్లో కొత్త చర్చకు తెర తీశాయి. పార్టీ పేరు ఎత్తకుండానే వైసీపీకి తన మాటల తూటాలు తగిలేలా మాట్లాడారు. తాజాగా భోళా శంకర్ ఆడియో వేడుకలో తనదైన శైలిలో చిరంజీవి మాట్లాడారు. ఇప్పటివరకు ప్రభుత్వంపై విమర్శలు చేయని చిరంజీవి రెండు రోజుల క్రితం చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపాయి. సినిమా అనేది చిన్న ఇండస్ట్రీ అని.. పిచ్చుకమీద బ్రహ్మాస్త్రం ఎందుకంటూ జగన్ ని ఉద్దేశించి చిరు సెటైర్ వేశారు.
సినిమా బడ్జెట్ ఎంత? హీరో రెమ్యునరేషన్ ఎంత? అనేవి పార్లమెంట్ లో చర్చించే అవసరమేముంది. ముందు రాష్ట్ర అభివృద్ధి, ప్రత్యేక హోదాలపై చర్చిస్తే బాగుంటుందని జగన్ ప్రభుత్వానికి చురకలు అంటించారు. మెగాస్టార్ మాటలకు ఊహించని రీతిలో సమాధానం ఇచ్చారు వైసీపీ మంత్రులు, నేతలు.
సేనలోకి చిరు ఎంట్రీ.. తర్జన-భర్జన…
వైసిపిపై మెగాస్టార్ చిరంజీవి తాజాగా చేసిన వ్యాఖ్యల్లో అంతరార్థం తమ్ముడు పార్టీలోకి వెళ్తవచ్చేమో..అన్న అనుమానాలు సర్వత్రా నెలకొన్నాయి.2009 లో ప్రజారాజ్యం పార్టీ ఏర్పాటు చేసి.. 18 స్థానాలకు పరిమితమై.. పార్టీని నడపలేక తర్వాత కాంగ్రెస్ లో విలీనం చేసిన చిరంజీవి అప్పటి నుంచి రాజకీయాల్లో అంత చురుగ్గా లేరు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ , నాగబాబులు వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ వచ్చారు. అయితే చిరంజీవి మాత్రం జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేయలేదు. పైగా.. టికెట్ రేట్లు పెంచడానికి అనుమతి కోసం సీఎం జగన్ వద్ద.. రెండు చేతులు ఎత్తి దణ్ణం పెట్టి మరీ దేవిరించిన చిరంజీవి తన ఆత్మగౌరవాన్ని పోగొట్టుకున్నట్లు విమర్శలు ఎదుర్కొన్నారు.
ఈ క్రమంలో తమ్ముడిని తనను టార్గెట్ చేసిన వైసిపి నాయకులకు గట్టి సమాధానం ఇవ్వాలని జనసేనలోకి రంగ ప్రవేశం చేస్తారని ప్రచారం జోరుగా సాగుతోంది. చిరు నిర్ణయం ఎలా ఉంటుందని సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే చిరంజీవి ఆచి-తూచి వ్యవహరిస్తారని.. అయన జనసేనలోకి వెళ్లి పవన్ కి మద్దతు ఇచ్చేది ఏమీ ఉండదని మెగా కుటుంబంలో ఓ కీలక వ్యక్తి వ్యాఖానించినట్లు ప్రచారం జరుగుతోంది.