” సంక్షేమం పేరుతొ ఆంధ్రప్రదేశ్ లో పేద వర్గాలను విశేషంగా ఆకట్టుకుంటున్న సీఎం జగన్మోహన్ రెడ్డి.. .. రాష్ట్రంలో వనరులను తీవ్ర స్థాయిలో దుర్వినియోగం చేస్తున్నా జనానికి పట్టాడంటూ మేధావులు, ప్రతిపక్షాలు గొంతెత్తి ఘోషిస్తున్నాయి.. భూములు, మైనింగ్, ఇసుక దోపిడీ వంటి వనరులను దోచుకుంటూ వేల కోట్ల ఖజానా సంపదను పోగేసుకున్న బ్యాచ్ .. ఎన్నికలలో జనానికి ఎంత సొమ్మైనా పంచడానికి వెనుకంజ వేయబోరు…”
రాష్ట్ర భవిష్యత్తుతో పాటు తమ పిల్లల భవిష్యత్తుపై ఆలోచన ఉన్న వారు జగన్రెడ్డి విధ్వంసకర పాలనను వ్యతిరేకిస్తారు కనుక.. వారందరినీ ఆయన పెత్తందార్లుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. ” ఇది పేదలకు, పెత్తందారులకు జరుగుతున్న పోరాటం..” అంటూ పదేపదే జగన్ చెప్పడాన్ని ఏమని అర్ధం చేసుకోవాలి. తాత్కాలిక సంతోషాన్ని మాత్రమే కలిగించే సంక్షేమ పథకాలు పొందుతున్న వారి అమాయకత్వాన్ని అడ్డుపెట్టుకొని అరాచకాలకు తెగబడుతున్నది నిజం కాదా? జగన్మోహన్ రెడ్డి తప్ప అధికారాన్ని అడ్డుపెట్టుకొని సంపద పోగేసుకున్న నాయకులలో జగన్ స్తానం ఏ పాటిదో తెలిసిందే. అయినా తాను పేదల ప్రతినిధినని అంటే నమ్మాలంటున్నారు. జగన్మోహన్ రెడ్డికి ఎంత అధికారం ఉన్నప్పటికీ, వెనకాల ఎంత డబ్బు ఉన్నప్పటికీ, ఢిల్లీలో పరపతి అరచేతి మందాన ఉన్నప్పటికీ ప్రలోభాలకు లొంగకుండా నిబద్ధతతో పనిచేసే వ్యక్తులు వ్యవస్థలలో మిగిలే ఉన్నారు. అందుకే జగన్ అండ్ కో ఆయా వ్యవస్థలపై అక్కసు వెళ్లగక్కుతోంది. తన అధీనంలోని సీఐడీ మాదిరిగా.. ప్రశ్నించేవారిపై, గిట్టనివారిపై తప్పుడు కేసులు పెట్టి హింసించాలని అన్ని వ్యవస్థల నుంచీ జగన్ అండ్ కో ఆశిస్తున్నట్టుగా ఉంది. ఈ నాలుగేళ్లలో సీఐడీ విభాగం ఎంత మందిపై ఎన్ని కేసులు పెట్టిందో లెక్కలేదు. అయితే ఒక్క కేసులో కూడా విచారణ చేసి చార్జిషీటు దాఖలు చేయలేదు. చార్జిషీటు దాఖలు చేస్తే కేసులోని డొల్లతనం బయటపడుతుందిగా! దీన్నిబట్టి సీఐడీ విభాగాన్ని జగన్మోహన్ రెడ్డి ఎంతగా దిగజార్చారో స్పష్టమవుతోంది. కేంద్ర ఏజెన్సీలతో పాటు న్యాయ వ్యవస్థ కూడా అలాగే పతనమై జగన్ అండ్ కోను సంతోషపెట్టాలన్నది వారి అభిమతం. జగన్ దీర్ఘకాలం అధికారంలో కొనసాగితే న్యాయం చేయగల వ్యవస్థలలోని మిగిలి ఉన్న వ్యక్తులు కూడా కనుమరుగు కావొచ్చు. వ్యవస్థలన్నీ తమకు అనుకూలంగా పనిచేయాలని, ప్రజలందరూ తనకే ఓటు వేయాలని జగన్మోహన్ రెడ్డి కోరుకుంటూ ఉండవచ్చును గానీ అది ఎన్నటికీ జరగదు. రాజకీయాలు చెడిపోయాయని కూడా జగన్ అంటుంటారు. అంటే తాను ఏం చేసినా ఇతర పక్షాలు చప్పట్లు కొట్టాలి. అలా జరగదు కనుక రాజకీయాలు చెడిపోయాయని ఆయన చిరాకు పడతారు. జగన్ మెప్పు పొందాలంటే.. దర్యాప్తు సంస్థలన్నీ జగన్ రాసిచ్చిన స్ర్కిప్ట్నే చార్జిషీట్లుగా రూపొందించాలి. న్యాయస్థానాలు అనుకూలంగా తీర్పులివ్వాలి. ప్రజలు కూడా ఆయన సొంత పత్రిక మాత్రమే చదవాలి– సొంత చానల్ మాత్రమే చూడాలి. అనే రీతిలో వాలంటీర్లతో సాక్షి పత్రిక ప్రమోట్ చేసుకున్నారు. ఇలాంటి వాటిపై ఎవరు విమర్శలు చేసినా.. జగన్ బ్యాచ్ ఎదురుదాడి చేయడం, కేసులు పెట్టడం వంటి విపరీత పరిణామాలకు తెగబడుతుండటం ఎంత వరకు వాళ్లకి క్షేమదాయకమో తెలియదు మరి.