నైరుతి రుతుపవనాల సీజన్లో పుష్కలంగా వర్షాలు కురవాల్సిన ఆగస్టు నెలలో వేసవి వేడి, పొడి వాతావరణం కొనసాగుతోంది. 1901 తరువాత అత్యంత పొడి ఆగస్టుగా ఈ ఏడాది ఆగస్టు నమోదైంది. ప్రధానంగా ఎల్నినో ప్రభావంతో వర్షాలు గణనీయంగా తగ్గి, తేమశాతం కూడా అదేస్థాయిలో తగ్గుముఖం పట్టడమే దీనికి కారణమని వాతావరణ శాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఈ ఏడాది ఆగస్టులో ఇప్పటివరకు 32 శాతం తక్కువ వర్షపాతం నమోదైంది. కాగా, 1913లో 24.1 శాతం, 1920లో 24.4 శాతం, 1965లో 24.6 శాతం, 2005లో 25 శాతం తక్కువ వర్షపాతం నమోదైంది. దక్షిణ అమెరికాకు ఆనుకుని పసిఫిక్ మహా సముద్రంలో ఉపరితల జలాలు బాగా వేడెక్కడంతో భారతదేశంపైకి రావాల్సిన తేమ మేఘాలు పొడిగా మారాయి. దీంతో వర్షాలు తగ్గుముఖం పట్టాయి. అదేవిధంగా…. మరికొన్ని ప్రతికూల పరిస్థితుల ప్రభావంతో బంగాళాఖాతం, అరేబియా నుంచి దేశ భూభాగంపైకి తేమ గాలుల రాక నిలిచిపోయింది. దక్షిణ చైనా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనాలు పశ్చిమ దిశగా పయనించి థాయ్లాండ్ మీదుగా ఉత్తర బంగాళాఖాతంలోకి ప్రవేశించాలి. కానీ, ఈ నెలలో దక్షిణ చైనా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనాలు ఉత్తర దిశగా పయనించాయి. దీంతో బంగాళాఖాతంలో అల్పపీడనాలు ఏర్పడేందుకు అవకాశం లేకుండా పోయింది. సెప్టెంబరులోనూ సాధారణం కంటే తక్కువ వర్షపాతం కురుస్తుందని, అయితే ఆగస్టులో నెలకొన్నంత వర్షాభావ పరిస్థితులు ఉండకపోవచ్చని వాతావరణ శాఖ అధికారి ఒకరు చెప్పారు.