ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అధికార వైసీపీకి షాక్ ఇచ్చింది. ఇటీవలే జరిగిన పట్టభద్రుల కోటా ఎన్నికల్లో మూడు స్థానాలనూ గెలుచుకుని వైసీపీని డిఫెన్స్లో పడేసిన ఆ పార్టీ ఎవరూ ఊహించనివిధంగా ఎమ్మెల్యే కోటాలోనూ పోటీ చేసి ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని కైవసం చేసుకుంది. టీడీపీ తరపున ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలో నిలుచున్న విజయవాడ నగర మాజీ మేయర్ పంచుమర్తి అనూరాధ సంచలన విజయం సాధించారు. ఎమ్మెల్యే కోటాలో ఏడుస్థానాలకు ఎన్నికలు జరగ్గా వైసీపీ అన్ని స్థానాలకూ పోటీ చేసింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో 151 స్థానాలను ఆ పార్టీ గెలుచుకున్న విషయం తెలిసిందే. నాడు టీడీపీ 23 స్థానాలను మాత్రమే పరిమితమైంది. అయితే ఆ తర్వాత ఆ పార్టీ నుంచి గెలిచిన నలుగురు ఎమ్మెల్యేలు వైసీపీ పంచన చేరారు. దాంతో ప్రధాన ప్రతిపక్షం బలం 19కు దిగజారింది. ఇక జనసేన తరపున ఎన్నికైన ఏకైక ఎమ్మెల్యే కూడా అధికార పక్షం నీడనే చేరడంతో అధికార పార్టీ బలం 155కు చేరింది. ఒకఎమ్మెల్సీ స్థానం గెలవడానికి 22 ఓట్లు అవసరమవుతాయి. ఈనేపథ్యంలోనే విపక్షానికి ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదనే లక్ష్యంతో వైసీపీ వ్యూహాత్మకంగా అన్నిస్థానాలకూ అభ్యర్థులను నిలిపి వారినందరినీ గెలిపించుకునేందుకు సర్వశక్తులూ ఒడ్డింది.
వైసీపీ రెబెల్స్ సహాయంతోనే టీడీపీ గెలుపు..
ఇటీవల వైసీపీకి రెబెల్స్ గా మారిన నెల్లూరు జిల్లాకు చెందిన ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్రెడ్డితోపాటు మరో ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీ అభ్యర్థికి ఓటు వేయడం వల్లనే అనూరాధ గెలుపు సాధ్యమైందని రాజకీయవర్గాలు చెపుతున్నాయి. ఇప్పటిదాకా విపక్ష నేతలను ముప్పుతిప్పలు పెడుతూ వారికి ఊపిరి తీసుకునే అవకాశం కూడా ఇవ్వకుండా తనదైన శైలిలో రాజకీయం చేస్తున్న వైసీపీకి ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు శరాఘాతంగా మారాయనే చెప్పాలి. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రభుత్వంపై వ్యతిరేకతను స్పష్టం చేయగా, ఎమ్మెల్యే కోటా ఎన్నికలు అధికార పార్టీలో ఉన్న అసమ్మతిని తెలియజేశాయంటూ రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ప్రస్తుత పరిణామాలను బట్టి చూస్తే త్వరలోనే ఆ పార్టీ నుంచి మరిన్ని అసమ్మతి గళాలు వినిపించే అవకాశాలను కొట్టిపారేయలేమన్న వాదనలు వినిపిస్తున్నాయి. అధికార పార్టీ ఈ సవాళ్లను ఎలా ఎదుర్కోనుందో చూడాలి.