కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి గట్టి ఝలక్. ఆయన ఎంపీ కొనసాగడానికి అనర్హుడని లోక్ సభ ప్రకటించింది. పరువు నష్టం కేసులో రెండేళ్ల జైలు శిక్ష పడ్డ రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేస్తూ లోక్ సభ సెక్రటేరియట్ శుక్రవారం (మార్చి 24) ప్రకటన విడుదల చేసింది. దీంతో పాటు రాహుల్ ఆరేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కూడా కోల్పోతారు. ఈ పరిణామం కాంగ్రెస్ పార్టీని దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. త్వరలో జరగనున్న కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు, వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరగనున్న వేళ.. రాహుల్ గాంధీని కావాలనే అనర్హుడిగా చేసారని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తర ప్రదేశ్లోని అమేథి, కేరళలోని వయనాడ్ నియోజకవర్గం నుంచి లోక్ సభకు పోటీ చేసిన రాహుల్ గాంధీ.. అమేథిలో స్మృతి ఇరానీ చేతిలో ఓటమి పాలయ్యారు. వయనాడ్ నుంచి గెలుపొంది ఇంతకాలం ఎంపీగా కొనసాగారు. మోదీ ఇంటి పేరు(Modi surname) కలవారందరూ దొంగలే అంటూ వ్యాఖ్యానించి రెండేళ్ల జైలుశిక్ష పొందిన కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీ (Congress MP Rahul Gandhi)పై అనర్హత వేటు పడింది. దీనికి సంబంధించి లోక్సభ సెక్రటేరియట్ నుంచి సర్క్యులర్ జారీ అయింది. 1951 ప్రజాప్రాతినిధ్య చట్టం సెక్షన్ 8(3) ప్రకారం ఆయనపై అనర్హత పడింది. సూరత్ కోర్ట్ తీర్పు ప్రకారం లోక్సభ సెక్రటేరియట్ ఆయనపై వెంటనే చర్యలకు దిగింది.