కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా మౌనంగా ఉంటున్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి శుక్రవారం బీజేపీలో చేరారు. దేశరాజధాని ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్సింగ్, ఓబీసీ మోర్చా అధ్యక్షుడు లక్ష్మణ్ సమక్షంలో ఆయన కాషాయ కండువా వేసుకున్నారు.
ఉమ్మడి ఏపీకి చివరి ముఖ్యమంత్రి
కరడుగట్టిన కాంగ్రెస్ పార్టీ కుటుంబానికి చెందిన కిరణ్కుమార్రెడ్డి తానూ అదేబాటలో కొనసాగారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పలు పదవులు నిర్వహించారు. వైఎస్ రాజశేఖర్రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో శాసనసభ స్పీకర్గా, ప్రభుత్వ చీఫ్విప్గా బాధ్యతలు నిర్వహించారు. వైఎస్సార్ మరణం తర్వాత రోశయ్య సీఎం పదవి చేపట్టినా కాంగ్రెస్ పార్టీలో అస్థిరత నివారించేందుకు, నాటి రాష్ట్ర విభజన ఉద్యమానికి పరిష్కారం వెదికేందుకు ఆయనను దించి కాంగ్రెస్ అధిష్ఠానం కిరణ్కుమార్రెడ్డికి సీఎం పీఠం అప్పగించింది. 2010 నవంబర్ 25 నుంచి 2014 మార్చి 1 వరకు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు. అయితే తదనంతర పరిణామాలతో ఆయన కాంగ్రెస్ అధిష్ఠానాన్ని ధిక్కరించి రాష్ట్ర విభజనను వ్యతిరేకించారు. అయినా రాష్ట్రం విడిపోవడాన్ని అడ్డుకోలేకపోయారు. ఉమ్మడి ఏపీకి చివరి ముఖ్యమంత్రిగా నిలిచారు.
విఫలమైన సొంత పార్టీ ప్రయోగం
రాష్ట్ర విభజన అనంతరం కిరణ్కుమార్రెడ్డి జై సమైక్యాంధ్ర పేరుతో పార్టీని స్థాపించారు. నాటి కాంగ్రెస్ పార్టీలోని కొందరు సీనియర్ నాయకులు ఆయన వెంటనడిచినా ఆ పార్టీ 2014 ఎన్నికల్లో దారుణ పరాజయాన్ని మూటగట్టుకుంది. ఆ తర్వాత కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉన్న కిరణ్కుమార్రెడ్డి మళ్లీ కాంగ్రెస్ పార్టీలోనే చేరినా ఆ పార్టీ బలోపేతానికి ఎలాంటి ప్రయత్నాలు చేయలేదనే చెప్పాలి. తాజాగా ఆయన బీజేపీలో చేరడం ద్వారా రాజకీయంగా కొత్త ఇన్నింగ్స్ మొదలు పెట్టారు.
స్వీయ తప్పిదాలతోనే కాంగ్రెస్ దుస్థితి
బీజేపీలో చేరిన సందర్భంగా కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్కు రాజీనామా చేస్తానని తానెప్పుడూ అనుకోలేదన్నారు. స్వయంకృత అపరాధాల కారణంగానే కాంగ్రెస్ పార్టీ దేశంలో అంతకంతకూ బలహీనపడుతోందన్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో పార్టీ నిర్వీర్యమైందన్నారు. విభజనపై కాంగ్రెస్ ఎవరినీ సంప్రదించకుండా నిర్ణయం తీసుకుందని విమర్శంచారు. నాయకత్వ లేమితో కాంగ్రెస్ ఇబ్బందులు పడుతుండగా బీజేపీ అప్రతిహతంగా ఎదుగుతోందని వ్యాఖ్యానించారు. తమది 1952 నుంచి కాంగ్రెస్ కుటుంబమన్నారు. ఓటమి నుంచి కాంగ్రెస్ గుణపాఠాలు నేర్చుకోకపోవడం వల్లనే ఆ పార్టీ ప్రస్తుత దుస్థితికి చేరిందన్నారు. దేశాన్ని వృద్ధి చేయాలన్న లక్ష్యం, గెలవాలనే తపన, దూరదృష్టి బీజేపీలో మాత్రమే ఉన్నాయన్నారు. అధిష్టానం తనకు ఏ పని అప్పగించినా చేయడానికి సిద్ధంగా ఉన్నానని కిరణ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.
అధికారమే లక్ష్యంగా పోరాటం
కిరణ్కుమార్ చేరికతో ఏపీలో బీజేపీ బలోపేతం అవుతుందని మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. కాగా కిరణ్కుమార్రెడ్డి బీజేపీలో చేరికను తాను మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నానని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కిరణ్ కుమార్కు ఫోను చేసి శుభాకాంక్షలు తెలియజేశానన్నారు. ఆయనతో త్వరలోనే సమావేశమై రాష్ట్రంలో బీజేపీ బలోపేతంపై చర్చిస్తానన్నారు. కిరణ్ కుమార్ చేరికతో రాష్ట్రంలో బీజేపీ మరింత శక్తివంతమై ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదిగి 2024 సార్వత్రిక ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా పనిచేస్తామని సోము వీర్రాజు స్పష్టం చేశారు.
సొంత బలం పరిమితంగానే ఉన్న ఏపీలో బీజేపీని బలోపేతం చేసేందుకు కిరణ్కుమార్రెడ్డి ఎలాంటి వ్యూహాలు అనుసరించనున్నారు.. ఆయనకు బీజేపీ అధిష్ఠానం ఎలాంటి బాధ్యతలు అప్పగించనున్నదన్న అంశాలు ప్రస్తుతం ఆసక్తికరంగా మారాయి.