‘మన కళ్ళ ముందు అన్యాయం జరుగుతున్నా మనలో చాలా మంది పట్టించుకోరు. కానీ ఏపీలో ఓ విద్యార్థి తమకు ఎదురైన సమస్యను హైకోర్టు చీఫ్ జస్టిస్ కి లేఖ రాసాడు…’
పాఠశాల విలీనం కారణంగా తనతోపాటు తోటి విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యను ఓ విద్యార్థి ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ దృష్టికి తీసుకొచ్చాడు. తమ గ్రామాలకు బస్సు సౌకర్యం లేకపోవడం వల్ల నడిచి వెళ్లడం కష్టంగా ఉన్నదని, మీరు చర్యలు తీసుకోకపోతే తల్లిదండ్రులు తమను చదువు మాన్పించి కూలీకి పంపుతారంటూ విచారం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో రాష్ట్రంలో స్కూళ్ల విలీనం నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
అనంతపురం జిల్లాకు చెందిన హైస్కూల్ 7 వ తరగతి విద్యార్థి ఏపీ హైకోర్టు సీజే ప్రశాంత్ కుమార్ మిశ్రాకు ఉత్తరం రాశాడు. జిల్లా పరిధిలోని కుందుర్పి మండలం మాయదార్లపల్లి ప్రాథమికోన్నత పాఠశాలను ఇటీవల బసాపురం ఉన్నత పాఠశాలలో విలీనం చేశారు. దాంతో తమ ఊరి నుంచి 6,7,8 తరగతులకు చెందిన విద్యార్థులు కాలినడకన 7 కిలోమీటర్ల దూరంలోని బసాపురానికి వెళ్లాల్సి వస్తుందని విచారం వ్యక్తం చేశాడు. ఇలా ప్రతి రోజు 14 కిలోమీటర్లు నడవడం చాలా కష్టంగా ఉన్నదని చెప్పాడు. ఇప్పటికే మా స్కూల్ మూతపడి 40 రోజులవుతున్నదని, మధ్యాహ్న భోజనం కూడా లేదని తెలిపాడు. నాడు-నేడులో మా స్కూల్ బాగా తీర్చిదిద్దారని, ఇప్పుడు విలీనం చేయడం వల్ల నష్టపోతామని చెప్పాడు. తమరు పెద్ద మనుసుతో మా పాఠశాలను విలీనం చేయకుండా చేస్తే మేమంతా బాగా చదువుకుంటామని విన్నవించాడు. లేదంటే తమ తల్లిదండ్రులు తిరిగి పనుల్లోకి పంపుతారని, దయచేసి మా సమస్యను తీర్చండి అంటూ వేడుకున్నాడు.
ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాకు ఓ హైస్కూల్ విద్యార్థి రాసిన ఉత్తరం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. ఈ ఉత్తరంపై సీజే ఏవిధంగా రియాక్ట్ అవుతారో.. ఎలాంటి రికమండేషన్స్ ప్రభుత్వానికి చేస్తారో అని రాష్ట్రంలోని విద్యార్థులు ఆకస్తిగా ఎదురుచూస్తున్నారు. విలీనం కారణంగా విద్యార్థులు నష్టపోతున్నా ప్రభుత్వం మొండికి పోతున్నదని పలువురు నెటిజెన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్కూళ్ల విలీనంపై రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే ఆందోళనలు కొనసాగుతున్నాయి.