బంగార్రాజు మూవీతో సక్సెస్ అందుకున్న నాగార్జున కథానాయకుడిగా రానున్న తాజా మూవీ ది ఘోస్ట్. యాక్షన్ థ్రిల్లర్ గా దర్శకుడు ప్రవీణ్ సత్తారు ఈ మూవీని రూపొందిస్తున్నారు. ప్రవీణ్ గతంలో రాజశేఖర్ హీరోగా తెరకెక్కించిన గరుడవేగ మూవీ మంచి విజయాన్ని అందుకున్న నేపథ్యంలో ది ఘోస్ట్ చిత్రంపై మంచి అంచనాలే నెలకొన్నాయి.
ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్, టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో వారిలో మరింత ఆసక్తి పెంచేవిధంగా ట్రైలర్ రిలీజ్ చేసేందుకు చిత్రబృందం సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా ఈ ట్రైలర్ను టాలీవుడ్ సూపర్స్టార్ మహేష్ చేతులమీదుగా లాంఛ్ చేయనున్నట్టు ది ఘోస్ట్ మూవీ టీం మంగళవారం ప్రకటించింది.
నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్, శ్రీవెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ల మీద ప్రతిష్టాత్మకంగా నిర్మాణమవుతున్న ఈమూవీలో సోనాల్ చౌహాన్ కథానాయికగా నటిస్తోంది. గుల్ పనాగథ్, రవివర్మ, మనీష్ చౌదరి, శ్రీకాంత్ అయ్యంగార్, సురేంద్రన్ తదితరులు ఇతర పాత్రల్లో కనిపించనున్నారు. ఈ ఏడాది దసరా కానుకగా అక్టోబర్ 5న ఈ చిత్రాన్ని ప్రేక్షకులముందుకు తీసుకువచ్చేందుకు చిత్రబృందం సన్నాహాల్లో ఉంది.