” వైసీపీ గూండాలు అన్ పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడుతూ నన్ను వేధిస్తున్నారు. ఒక మహిళా శాసనసభ్యురాలని కూడా చూడకుండా… .. తమ ఇంట్లో ఒక అక్కా చెల్లి ఉన్నారని కూడా చూడకుండా వాళ్లు వాడే లాంగ్వేజ్ చూస్తుంటే చాలా బాధ వేస్తోంది…” అని వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్లో క్రాస్ ఓటింగ్ ఆరోపణల అనంతరం తొలిసారిగా మీడియా ముందుకు వచ్చారు. శ్రీదేవి మాట్లాడుతూ.. ‘‘ నిన్నటి నుంచి కొత్త కథలు. శ్రీదేవి ఎక్కడ అంటూ. శ్రీదేవి అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది. హైదరాబాద్ అనేది సహారా ఎడారా? లేదంటే దుబాయ్లోని అండర్ గ్రౌండా? నేనేమైనా మాఫియా గ్యాంగా? టెర్రరిస్టునా? అజ్ఞాతంలోకి వెళ్లడానికి కారణం ఏంటంటే.. మొన్న డాక్టర్ సుధాకర్ ఎలా చనిపోయారు? నిన్న డాక్టర్ అచ్చన్న ఎలా చనిపోయారనేది మీకు తెలుసు. వీరిలాగే శ్రీదేవి కూడా చనిపోకూడదనే ఉద్దేశ్యంతోనే వెళ్లడం జరిగింది.మొన్న నా పార్టీ ఆఫీస్పై జరిగిన దాడిని మీరు చూశారా? ఆ పెయిడ్ ఆర్టిస్టులు పార్టీ ఆఫీసుకెళ్లి ధ్వసం చేయడమేంటి? ఉద్దండరాయిపాలెంలో ఇసుక మాఫియా ఎవరిది? నేనెక్కడ అడ్డు వస్తానో అని నాపై నిందలు వేస్తున్నారు. మొదటి నుంచి కావాలనే నాపై కుట్రలు చేస్తున్నారు. నేను ఓటుకు నోటు తీసుకున్నానని ముద్ర వేశారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు ముందు నుంచే నాపై కుట్రలు చేశారు. మహిళ అని చూడకుండా ఇష్టారీతిన విమర్శిస్తున్నారు. రాజధాని ఏరియాలో వాళ్లు చేసిన దందాలు, ఇసుక మైనింగ్.. మాఫియాలు అన్నీ చేసి ముడుపులు చెల్లించుకుని మా గౌరవ ముఖ్యమంత్రిగారు అంటారు.. డీపీటీ అంటే దోచుకో, పంచుకో, తినుకో. వీటన్నింటికీ నేనేక్కడ అడ్డు వస్తానోనని నన్ను తొలగించాలని నన్ను ప్లాన్ చేశారు. ఆ ప్రీ ప్లాన్లో భాగమే ఓటుకు నోటు కేసు. నేను ఓటేశానా? ఎవరికి వేశాను? అనేది తెలియకుండానే చిలవలు పలవలుగా కథనాలు వడ్డించారు.” అంటూ శ్రీదేవి వాపోయారు. ఒక రాజ్యాంగంలో ఎమ్మెల్యే పదవి 5 ఏళ్లు ఉంటుంది. కానీ ఏపీలో ఏ రాజ్యాంగం అమల్లో ఉందో తెలియదన్నారు. ఎలక్షన్ సమయంలో గడపగడపకు వెళ్లినప్పుడు ప్రతి ఒక్కరూ నన్ను అడిగారు.. ‘అమరావతి ఇక్కడే ఉంటుందా?’ అని. మా జగనన్న తాడేపల్లిలో ఇల్లు కట్టుకున్నారని.. ఇక అమరావతి రాజధాని కాకుండా ఎక్కడికి పోతుందని ధైర్యం చెప్పా. కానీ కొంతకాలంగా వారు రాజధాని కోసం ఇబ్బంది పడుతుంటే ఏం చేయలేకపోయేదాన్ని. అమరావతిలో జరిగిన అభివృద్ధి రాష్ట్రంలో ఎక్కడైనా ఏమైనా చేశారా? అభివృద్ధి పేరుతో వేల కోట్లు నొక్కేశారు. నాకు ఏపీకి రావాలంటే భయమేస్తోంది. ఎందుకంటే ఎస్సీలపై జరుగుతున్న దాడులు. ఎమ్మెల్యేగానే నేను భయపడుతుంటే.. సామాన్యులు తిరగగలరా?’’ అని శ్రీదేవి వైసీపీని ప్రశ్నించారు.