కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్గాంధీ లోక్సభ సభ్యత్వం రద్దుపై ఆ పార్టీ శ్రేణులు దేశవ్యాప్తంగా నిరసనలు చేపడుతున్న వేళ ప్రధాని మోదీపై ఆరోపణల విషయంలో తాను వెనక్కు తగ్గేదే లేదని, ఎవరికీ క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదని కుండబద్దలు కొట్టారు. ఆదానీ వ్యాపార అవకతవకలపై చేసిన ఆరోపణలపై మోదీ ప్రభుత్వం సమాధానాలు చెప్పేదాకా తన పోరాటం ఆగదని రాహుల్గాంధీ స్పష్టం చేశారు. అంతేకాదు.. జరగబోయే ఎలాంటి పరిణామాలకైనా సిద్ధమేనంటూ ప్రకటించారు.
ట్విట్టర్ ఖాతాలో డిస్ క్వాలిఫైడ్ ఎంపీగా డిజిగ్నేషన్ మార్పు
దానికి తగినట్టుగానే తన ఎంపీ పదవిపై అనర్హత వేటు పడిన నేపథ్యంలో ఆయన తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో బయోను అప్ డేట్ చేశారు. తన ఖాతా పేరుకు కింద కనిపించే బయో విభాగంలో ‘మెంబర్ ఆఫ్ పార్లమెంట్’ అని గతంలో ఉండగా తాజాగా దాన్ని ‘డిస్ క్వాలీఫైడ్ ఎంపీ’గా మార్పు చేశారు.
కాగా రాహుల్ సభ్యత్వం రద్దును బీజేపీ అణచివేత రాజకీయాలకు పరాకాష్టగా అభివర్ణిస్తూ ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు కాంగ్రెస్ పార్టీ వ్యూహరచన చేస్తోంది. ఈకారణంగానే తనపై కోర్టు విధించిన శిక్షపై పైకోర్టులో అప్పీల్ చేసుకునే అవకాశం ఉన్నా రాహుల్ చేయడంలేదని, ఆయన వచ్చే సార్వత్రిక ఎన్నికలకు ఇప్పటినుంచే ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారని ఆ పార్టీ వర్గాలు చెపుతున్నాయి.తాజా పరిణామాలు రాహుల్గాంధీకి దేశవ్యాప్తంగా ఎంతోకొంత సానుభూతిని సంపాదించిపెట్టిన విషయం వాస్తవమేనని రాజకీయవర్గాలు చెపుతున్నాయి. అయితే ఆపార్టీకి ఇవి ఏమేరకు ప్రయోజనం కలిగించనున్నాయో రాహుల్ భారత్ జోడో యాత్ర రెండో దశ చూశాక కానీ అంచనావేయలేమని విశ్లేషకులు అంటున్నారు.