చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నపుడు రాష్ట్రానికి ఎంతో చేయాలనీ ఉవ్విళ్ళూరుతూ పార్టీని గాలికొదిలేస్తారు? ఇది ఆ పార్టీ వారే చెప్పే మాట. MLC ఎన్నికలలో నాలుగు గెలుచుకున్నంత మాత్రానా అత్యుత్సాహం పనికిరాదు.. అంటూ ఏబీఎన్ రాధాకృష్ణ గారు చంద్రబాబుకి ఓ సలహా ఇచ్చేసారు. తన ‘కొత్త పలుకు’ శీర్షిక ద్వారా. నిజమే. ఇది కరెక్టే. ఆర్కే గారు ప్రవచించినట్లు పార్టీ బలోపేతం ఇప్పటికిప్పుడు అయ్యే పనేనా? అనేది గుర్తెరగాలి. ఆంధ్రజ్యోతి కొత్తపలుకులో వేమూరి రాధా కృష్ణ గారు ఈ వారం రాసిన
ఫైనల్ స్క్రిప్ట్ ప్రజలదే! ఆర్టికల్ లో కొంత యధాతదంగా ఇక్కడ ఇస్తున్నాం.
”2019కి ముందు అధికారం అనుభవించిన పలువురు మంత్రులు, నాయకులు.. ఓటమి తర్వాత కలుగుల్లో దూరిపోయారు. ఫలానా వాళ్లు పార్టీలో ఉన్నారా? లేరా? అంటే చెప్పలేని పరిస్థితి. ఇప్పుడు వాతావరణం అనుకూలంగా మారుతున్నది అని గ్రహించి చంద్రబాబు చుట్టూ చేరిపోతున్నారు. చంద్రబాబు అనుసరించిన రాజకీయాల వల్ల నిబద్ధత ఉన్న వాళ్ల కోసం ఆ పార్టీలో కాగడా వేసి వెతకాల్సిన పరిస్థితి ఏర్పడింది. నాలుగు దశాబ్దాల ప్రస్థానాన్ని పూర్తిచేసుకున్న తెలుగుదేశం పార్టీ ఎప్పటికప్పుడు అభ్యర్థుల కోసం వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడటానికి చంద్రబాబే కారణం. ఎన్నికల సందర్భంగా తరచుగా అభ్యర్థులను మార్చడం వల్ల పరస్పర అపనమ్మకాలు చోటుచేసుకుంటున్నాయి. రిజర్వుడు నియోజకవర్గాల్లో ప్రతిసారీ కొత్త అభ్యర్థులను పోటీకి పెట్టడం వల్ల ఆయా వర్గాల నుంచి నాయకులు ఎదగడం లేదు. మొహమాటాలను పక్కన పెట్టి, కాకారాయుళ్లను, ఆషాఢభూతులను చంద్రబాబు వదిలించుకోవాలి. పార్టీ పునర్నిర్మాణానికి ఈ ఎన్నికలు చంద్రబాబుకు చక్కని అవకాశమని చెప్పవచ్చు. పార్టీ పునాదులను ఇప్పుడు పటిష్ఠం చేయకపోతే తెలుగుదేశం పార్టీ పరిస్థితి దినదిన గండం నూరేళ్లాయుష్షు అన్నట్టుగానే ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యంగా పార్టీని నమ్ముకొని, అంటిపెట్టుకొని అష్టకష్టాలు పడ్డవారిని చంద్రబాబు విస్మరించకూడదు. గడచిన కొన్ని రోజులుగా పార్టీ నాయకులు కొందరి ప్రకటనలు, వ్యాఖ్యలు గమనిస్తే అధికారంలోకి వచ్చేశామన్న అతి విశ్వాసం కనిపిస్తోంది. ఇలాంటి ప్రగల్భాలను ప్రజలు హర్షించరు. వైసీపీకి చెందిన మంత్రులు, శాసనసభ్యులు కొందరు అడ్డూ అదుపూ లేకుండా నోరు పారేసుకోవడం కూడా జగన్ ప్రభుత్వంపై వ్యతిరేకత ఏర్పడటానికి ఒక కారణం అని గుర్తించాలి. నాలుగు ఎమ్మెల్సీ స్థానాలు వచ్చినంత మాత్రాన అంతా అయిపోలేదు. అసలైన పోరాటం ముందుంది. జగన్ వద్ద అధికార, ధన బలం పుష్కలంగా ఉంది. ఎన్నికల సందర్భంగా జగన్రెడ్డి ఏ స్థాయిలో అధికార దుర్వినియోగానికి పాల్పడతారో స్వానుభవం ఉన్నందున పార్టీ యంత్రాంగాన్ని అందుకు దీటుగా తీర్చిదిద్దడంపై చంద్రబాబు దృష్టి పెట్టాలి.”
రాధాకృష్ణ గారు ఇచ్చిన ఈ సలహా చంద్రబాబు, టీడీపీ నేతలు పాటిస్తే మంచిదే. 2019 లో బెడిసికొట్టిందని ఆర్కే గారి సలహాను పెడచెవిన పెట్టకండి టీడీపీ నేతలూ. మంచి ఎవరు, ఎపుడు చెప్పినా పాటించాలి కదా.. ఉచిత సలహా అనుకోకండి.. రాబిన్ శర్మ వంటి వ్యూహకర్తలకు కోట్లకు కోట్లు ఖర్చుపెడుతున్నారు కదా.. ఆర్కే గారు ఫ్రీగా సలహా ఇచ్చారు.