ఎంపీ అవినాష్ రెడ్డితో పాటు ఆయన తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డిలు నిందితులేనని.. అరెస్ట్లు తప్పవని హైకోర్టుకు సీబీఐ తేల్చిచెప్పింది. ఈ క్రమంలోనే అవినాష్ కుటుంబాన్ని అరెస్ట్ల టెన్షన్ పట్టి పీడిస్తోంది. వైఎస్ వివేకా హత్య కేసులో అరెస్టు చేసే అవకాశం ఉందని ఎంపీ అవినాష్ కుటుంబంలో టెన్షన్ కొనసాగుతోంది. రేపు కడపలో సీబీఐ ఎదుట వైఎస్ భాస్కర్ రెడ్డి విచారణకు హాజరుకానున్నారు. అయితే భాస్కర్ రెడ్డిని సీబీఐ అరెస్ట్ చేసే అవకాశం ఉన్నందున ఎంపీ అవినాష్ కుటుంబంతో పాటు వైసీపీ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి. ‘‘వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఎంపీ అవినాశ్ రెడ్డి !, ఆయన తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి ఇద్దరూ నిందితులే. వారిని అరెస్ట్ చేయాలని గత నెల 24న అవినాశ్ రెడ్డి విచారణ సందర్భంగానే నిర్ణయించాం. వారిని అరెస్టు చేస్తాం’’ అని సీబీఐ కుండబద్దలు కొట్టింది. తెలంగాణ హైకోర్టుకు ఈ విషయం సూటిగా చెప్పింది. అంతేకాదు… శుక్రవారం మూడోసారి విచారణకు హాజరైన అవినాశ్ రెడ్డి అరెస్టుకు సీబీఐ అధికారులు సర్వం సిద్ధం చేశారు. ‘ఆ విచారణ పూర్తయ్యేలోపు ఏ క్షణమైనా అరెస్టు చేస్తాం’ అని సీబీఐ న్యాయవాదులు హైకోర్టుకు కూడా స్పష్టం చేసినట్లు సమాచారం. కానీ… ‘సోమవారం దాకా ఆగండి’ అని హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఆదేశాలతో అరెస్టు నుంచి అవినాశ్ రెడ్డి కి స్వల్ప ఊరట కలిగినట్లయింది.