విశాఖ సభలో జగన్ పై నిప్పులు చెరిగిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా..
మైనింగ్, భూ మాఫియా, గంజాయి స్మగ్లింగ్..
అన్నిటిలోనూ వైసీపీ నాయకులే
కేంద్ర పథకాలపై జగన్ బొమ్మ
సొంత ప్రచారం చేసుకుంటున్నారు
పేదల బియ్యాన్నీ అమ్ముకుంటున్నారు
రైతు ఆత్మహత్యల్లో ఏపీకి మూడో స్థానం
వైసీపీ ప్రభుత్వం సిగ్గుపడాలి
తొమ్మిదేళ్లలో రూ.5 లక్షల కోట్లిచ్చాం
ఆ డబ్బుకు సరిపడా అభివృద్ధి ఏదీ?
విశాఖ సభలో కేంద్ర హోం మంత్రి ఫైర్
ఆంధ్రప్రదేశ్ లో జగన్ నాలుగేళ్ల పాలన చూసుకుంటే.. అవినీతి తప్ప మరొకటి కనిపించదు.
రైతు సంక్షేమ ప్రభుత్వమని చెప్పుకొంటున్న జగన్ పాలనలో ఏపీ రైతు ఆత్మహత్యల్లో మూడో స్థానంలో ఉంది. దీనికి సిగ్గుపడాలి.
– అమిత్ షా
ఆంధ్రప్రదేశ్లో అవినీతి తప్ప ఇంకేమీ కనిపించడం లేదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు.పేదల కోసం ఇచ్చిన బియ్యాన్నీ అమ్ముకుంటున్నారని ఆరోపించారు. కేంద్ర పథకాలపై జగన్ తన బొమ్మ వేసుకుని ప్రచారం చేసుకుంటున్నారని ధ్వజమెత్తారు. విశాఖపట్నాన్ని భూ రాబందుల కేంద్రంగా మార్చేశారని మండిపడ్డారు.
ప్రధాని మోదీ తొమ్మిదేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్బంగా బీజేపీ దేశవ్యాప్తంగా చేపట్టిన ‘సంపర్క్ అభియాన్’లో భాగంగా విశాఖ రైల్వే ఫుట్బాల్ గ్రౌండ్లో నిర్వహించిన బహిరంగసభలో ఆయన ప్రసంగించారు. ప్రధాని మోదీ చేసిన అభివృద్ధి పనుల కంటే జగన్ అవినీతిపైనే ఎక్కువగా మాట్లాడడం అందరినీ ఆశ్చర్యపరచింది. రైతుల కోసం కేంద్రం ఏటా రూ.6 వేల చొప్పున ఇస్తుంటే.. జగన్ అవి తానే ఇస్తున్నట్లుగా ప్రచారం చేసుకుంటున్నారని ఆరోపించారు. యూపీఏ పాలనలో 2009 నుంచి 14 వరకు ఏపీకి రూ.78 వేల కోట్లు ఇవ్వగా.. బీజేపీ అధికారంలోకి వచ్చాక 2014-19 వరకు రూ.2.7 లక్షల కోట్లు ఇచ్చిందన్నారు. మొత్తంగా చూసుకుంటే ఈ తొమ్మిదేళ్లలో రూ.5 లక్షల కోట్లగా పైగా ఇస్తే ఆ డబ్బంతా ఏమైందని ప్రశ్నించారు. ఆ డబ్బుకు సరిపడా అభివృద్ధి కనిపిస్తోందా అని అడిగారు. మైనింగ్, భూ మాఫియా, గంజాయి స్మగ్లింగ్.. ఇలా అన్నిటిలోనూ వైసీపీ నాయకులే ఉంటున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ఔషధాల తయారీలో కూడా కల్తీ జరుగుతోందని చెప్పారు.
ఏపీకి చేసినవెన్నో….
ఆంధ్రప్రదేశ్కు బీజేపీ ప్రభుత్వం అనేకం చేసిందని అమిత్షా అన్నారు. రెండు వందేభారత్ రైళ్లను మంజూరు చేసిందని.. విశాఖకు ఒకటి, తిరుపతి మరొకటి నడుస్తున్నాయని చెప్పారు. విశాఖ రైల్వేస్టేషన్ అభివృద్ధికి రూ.450 కోట్లు మంజూరు చేశామన్నారు. కడప, కర్నూలుల్లో విమానాశ్రయాల నిర్మాణానికి సహకరించామని, భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణానికి అనుమతులు ఇచ్చామని చెప్పారు. ‘ఏపీలో జాతీయ రహదారుల అభివృద్ధికి రూ.3 లక్షల కోట్లతో పాటు సాగరమాల కింద మరో రూ.85 వేల కోట్ల ప్రాజెక్టులు మంజూరు చేశాం. కాకినాడ, విశాఖపట్నం, తిరుపతి, అమరావతి నగరాలను స్మార్ట్ సిటీలుగా అభివృద్ధి చేస్తున్నాం. విశాఖపట్నం, అనంతపురాల్లో మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్కులు నిర్మిస్తున్నాం. తిరుపతిలో ఐఐటీ, విశాఖలో ఐఐఎం, మంగళగిరిలో ఎయిమ్స్, తాడేపల్లిగూడెంలో నిట్, శ్రీసిటీలో ఐఐఐటీ, విజయనగరంలో గిరిజన యూనివర్సిటీ, అనంతపురంలో సెంట్రల్ యూనివర్సిటీ ఏర్పాటుచేశాం. మరో మూడు మెడికల్ కాలేజీలు ఇచ్చాం. కాకినాడకు బల్క్ డ్రగ్ పార్క్ మంజూరుచేశాం’ అని తెలిపారు. కరోనా సమయంలో ప్రతి ఒక్కరికీ రెండు వ్యాక్సిన్లు ఉచితంగా వేశామని, వాటికి ఒక్క రూపాయి కూడా ఎవరూ వెచ్చించలేదన్నారు.
జగన్, వైసీపీ నేతల అక్రమాలు, హత్యల నుంచి కాపాడుతున్న కేంద్ర పెద్దలలో అమిత్ షా పేరు ప్రముఖంగా ప్రస్తావిస్తుంటారు. అలాంటి అమిత్ షా.. జగన్ పై ధ్వజమెత్తడంపై ఆంధ్రప్రదేశ్ ప్రజలు, ప్రజా సంఘాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయ్. ఇది అంతా ‘దొంగ రాజకీయం..’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.