”మైనింగ్ మాఫియాగా పేరొందిన నేత ఆస్తులు అటాచ్ చేయడం కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో రాజకీయాలలో సంచలంగా మారింది…” గనుల అక్రమాల కేసుల్లో మాజీ మంత్రి గాలి జనార్దనరెడ్డితో పాటు ఆయన భార్య లక్ష్మీఅరుణకు చెందిన 77 ఆస్తులను జప్తు చేయాలని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఆదేశించింది. ఆయనపై నమోదైన క్రిమినల్ కేసులు తేలేదాకా ఆస్తులు జప్తులోనే ఉంటాయని కోర్టు పేర్కొంది. జనార్దనరెడ్డి దంపతులకు సంబంధించిన 124 ఆస్తుల జప్తును కోరుతూ సీబీఐ అధికారులు కోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన న్యాయస్థానం, అవినీతి వ్యతిరేకచట్టం, క్రిమినల్ కేసుల సవరణ చట్టానికి అనుగుణంగా వారికి చెందిన 77 ఆస్తులను జప్తు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. జనార్దనరెడ్డి, సీబీఐ కోర్టు ఆదేశాలపై స్పందించారు. దేవుడి ఆశీస్సులతో బయటపడతానన్నారు. కాగా, గనుల ఆక్రమాల కేసులో జైలు పాలై బయటకు వచ్చాక గాలి బెంగళూరుకే పరిమితమయ్యారు. ఇటీవలే ‘కళ్యాణ రాజ్య ప్రగతిపక్ష’ పేరిట రాజకీయ పార్టీని స్థాపించి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే ఆ పార్టీ నుంచి పోటీచేసిన వారిలో ఆయనొక్కరే గెలుపొందడం విశేషం.