ఏ పార్టీలో కూడా శాశ్వత అధ్యక్షులు ఉండరని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. కేంద్ర ఎన్నికల కమిషన్ ఏపీ సీఎం జగన్కు షాకిచ్చింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాశ్వత అధ్యక్షుడి జగన్ నియామకం చెల్లదన్న ఈసీ.. వివరణ ఇవ్వాలని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శికి నోటీసులు పంపింది. ఈ ఏడాది జూలై 9 వ తేదీన గుంటూరులో జరిగిన పార్టీ ప్లీనరీ సమావేశంలో ఈ మేరకు జగన్ను వైసీపీ శాశ్వత అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు.
పార్టీలో శాశ్వత అధ్యక్షుడు లేదా శాశ్వత పదవులు ప్రజాస్వామ్యానికి విరుద్ధమని అభిప్రాయపడింది. అలాంటి ఎన్నిక నియమ నిబంధనలను ఉల్లంఘించినట్లేనని తెలిపింది. ప్రజాస్వామ్యంలో ఏ పార్టీకైనా ఎన్నికలు జరగాలని సూచించింది. ఈ మేరకు వివరణ కోరుతూ వైసీపీ జనరల్ సెక్రటరీకి ఉత్తర్వులిచ్చింది. ఎన్నికల కమిషన్ ఉత్తర్వులకు వైసీపీ వెంటనే రిప్లై ఇచ్చింది. తమ పార్టీలో శాశ్వత అధ్యక్షుడి ఎన్నిక జరగలేదని తమ సమాధానంలో పేర్కొన్నది. అయితే, మరింత వివరణాత్మకంగా తెలిపేందుకు అంతర్గత కమిటీ వేసి నివేదిక అందిస్తామని వైసీపీ ప్రధాన కార్యదర్శి వెల్లడించారు. దీనిపై స్పందించిన ఈసీ.. వెంటనే అంతర్గత విచారణ జరిపి ఈ అంశంపై మీడియాలో వస్తున్న వార్తలపై అయోమయానికి తెరదించాలని వైసీపీ ప్రధాన కార్యదర్శికి సూచించింది. అలాగే, దీనిపై బహిరంగ ప్రకటన చేయాలని కూడా వైసీపీని ఆదేశించినట్లుగా తెలుస్తున్నది.
పార్టీ రాజ్యాంగాన్ని మార్చి గౌరవ అధ్యక్షురాలిగా ఉన్న వైఎస్ విజయమ్మను తొలగించి పూర్తి స్థాయిలో శాశ్వత అధ్యక్షుడిగా వైఎస్ జగన్ ఎన్నికయ్యారని వైసీపీ ప్లీనరీలో ప్రకటించారు. అయితే పార్టీ ప్లీనరీ సందర్భంగా జరిగిన ఈ ఎన్నిక చెల్లదంటూ కొందరు ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేయడంతో.. ఎన్నికల కమిషన్ ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.