వంతెనలేక విజయనగరం జిల్లా భోగాపురం మండలం ముంజేరు పంచాయతీ పరిధిలోని మెట్టసబ్బన్నపేట ప్రజలు ఇబ్బందులెదుర్కొంటున్నారు. మెట్టసబ్బన్నపేట వద్ద ఉన్న ఉప్పుగెడ్డపై నిర్మించిన వంతెన వర్షాలకు పూర్తిగా కొట్టుకు పోయింది. ఈ వంతెనకు రెండు వైపులా పైపులతో సహా వంద మీటర్ల మేర రోడ్డు కోతకు గురయింది. నడవడానికి వీల్లేకుండా మారింది. దీనిపై నిత్యం మూడు పంచాయతీలకు చెందిన ఇరవై గ్రామాల రైతులు, కూలీలు, బడి పిల్లలు, భవన నిర్మాణ కార్మికులు రాకపోకలు సాగిస్తుంటారు. వీరంతా ప్రమాదకర స్థితిలో దీన్ని దాటుతూ కష్టాలెదుర్కొంటున్నారు. అత్యవసర సమయాల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఉప్పుగెడ్డపై వంతెన కోసం మంజూరైనా ప్రభుత్వం ఈ పనులను రద్దు చేసిందని ప్రజలు వాపోతున్నారు. ఆ తర్వాత శిలా ఫలకమైతే వేసింది కానీ.. ఇంత వరకు పనులు మొదలు పెట్టలేదని,, కనీసం ఉన్న వంతెనకు మరమ్మతులు చేయాలని కోరుతున్నారు. తమ గ్రామాల నుంచి సచివాలయానికి వెళ్లాలన్నా పాతిక కిలోమీటర్లు చుట్టూ తిరిగి పోతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. త్వరగా వంతెన నిర్మించిన కష్టాలను తీర్చాలని కోరుతున్నారు.