- కీలకంగా ఫార్మా ఎగుమతులు
దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న విమానాశ్రయాల్లో ఒకటిగా శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నిలిచింది. కేవలం 2 గంటల వ్యవధిలో దేశంలోని ఏ ప్రాంతానికైనా వెళ్లే అవకాశం ఈ ఎయిర్పోర్టుకుంది. ప్రయాణీకుల విషయంలోనే కాదు సరకు రవాణాలోనూ గణనీయమైన వృద్ధిరేటును నమోదు చేస్తోంది. 2008లో ప్రారంభించిన శంషాబాద్ ఎయిర్పోర్టులో కార్గో కోసమే ప్రత్యేకంగా టర్మినల్ నిర్మాణం చేపట్టి దేశీయ, అంతర్జాతీయంగా సరకు రవాణా కోసం ప్రత్యేక అభివృద్ధి ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తోంది.
దేశీయ సరకు రవాణాపరంగా ఏడాదికి 22 శాతం మేర వృద్ధిరేటు నమోదవుతోంది. భౌగోళికంగా దేశం మధ్యలో ఉండటం, మెరుగైన ఎయిర్ నెట్వర్క్, ఎయిర్ కార్గోపట్ల వినియోగదారుల ప్రాధాన్యాత, ఈ-కామర్స్కు ప్రజాదరణ కారణంగా దేశీయ రంగంలో వృద్ధి 35 శాతంగా ఉంటోంది. కోవిడ్ వల్ల ఎదురైన సవాళ్లను ధీటుగా ఎదుర్కొని జీఎమ్మార్ హైదరాబాద్ ఎయిర్ కార్గో (జీహెచ్ఎసీ) 2021లో దేశీయ (డొమెస్టిక్) కార్గో ట్రాఫిక్ను గణనీయంగా మెరుగుపర్చుకుంది. కోవిడ్ ముందు 2020 మొదట్లో హైదరాబాద్ విమానాశ్రయం నుంచి 55 దేశీయ గమ్యస్థానాలకు కనెక్టివిటీ ఉండగా, 2021 చివరినాటికి అది 65 గమ్యస్థానాలకు విస్తరించడంతో ప్రయాణికులు, సరకుల రవాణాపరంగా హైదరాబాద్ విమానాశ్రయానికి ఎంతో ప్రాధాన్యత పెరిగింది.
కార్గోలో 5వ స్థానం..
హైదరాబాద్ నుంచి జరిగిన కార్గో 2020తో పోలిస్తే 22 శాతం వృద్ధిని నమోదు చేసింది. 2019లో దేశంలో అతిపెద్ద కార్గో హబ్గా ఉన్న హైదరాబాద్.. ఇటీవల పెరిగిన వృద్ధి కారణంగా 5వ స్థానానికి ఎగబాకింది. వ్యూహాత్మకంగా హైదరాబాద్ ఎయిర్పోర్టుకు ఉన్న భౌగోళిక స్థానం, మెరుగైన డొమెస్టిక్ ఎయిర్ నెట్వర్క్, ఇతర రవాణా మార్గాలకన్నా ఎయిర్ కార్గోకు కస్టమర్లు ప్రాధాన్యత ఇవ్వడం, ఈ-కామర్స్కు ఆదరణ పెరగడం వంటి అనుకూల కారణాలతో హైదరాబాద్ విమానాశ్రయం డొమెస్టిక్ కార్గోలో 35 శాతంతో బలమైన వృద్ధిని నమోదు చేసింది. 2022లో దేశంలోని అన్ని ముఖ్యమైన ఈ కామర్స్ సప్లయి చైయిన్లతో హైదరాబాద్ నగరం కీలకపాత్ర పోషిస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్ నుంచి దేశం నలుమూలలా సరకు రవాణా చేసేందుకు వీలుగా ఉండటంతోపాటు ఈ-కామర్స్ సంస్థలు తమ ఫుల్ఫిల్మెంట్ సెంటర్లను శంషాబాద్ ఎయిర్పోర్టులోని ఏరోసిటీలో ఇప్పటికే ఏర్పాటు చేశాయి.
వేగంగా విస్తరణ
ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలతో క్లిష్టమైన షిప్మెంట్లను నిర్వహించగల సామర్థ్యం జీహెచ్ఎసీకి దక్కింది. నిరుడు దేశంలో అతిపెద్ద కోవిడ్ వ్యాక్సిన్ షిప్మెంట్లను సమర్థవంతంగా హ్యండిల్ చేసింది. ఈ ఏడాది డెడికేటెడ్ అంతర్జాతీయ కొరియర్ టెర్మినల్(ఐసీటీ)ని ప్రారంభించింది. మొత్తానికి దక్షిణ మధ్య భారతదేశంలో ఫార్మా ఎగుమతులకు హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా మారింది. ఇటీవల ఎక్స్పోర్ట్ ప్రాసెసింగ్ జోన్ను టెంపరేచర్ కంట్రోల్డ్ ప్రదేశంగా మార్చి తద్వారా అలాంటి సదుపాయం కలిగిన దేశంలోని ఏకైక కార్గో టెర్మినల్గా అవతరించింది.