- రూ.750 కోట్లతో అభివృద్ధి పనులు
- మల్టీ లెవల్ పార్కింగ్, విశ్రాంతి గదులు
- రూఫ్ టాప్ రైల్వే ట్రాప్ ప్లాట్ ఫామ్స్
- 2025 నవంబర్ నాటికి అందుబాటులోకి..అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మరపించేలా అన్ని అధునాతన సదుపాయాలతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రూపుదిద్దుకుంటోంది. రూ.750 కోట్ల నిధులతో అభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నాయి. రూఫ్ టాప్ రైల్వే ట్రాప్ ప్లాట్ ఫామ్స్, మల్టీ లెవల్ పార్కింగ్, విశ్రాంతి గదులు మరెన్నో సౌకర్యాలు దీని ప్రత్యేకత. బుధవారం ఆ పనులను కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పరిశీలించారు.
ఈ రైల్వే స్టేషన్ పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. ఇక్కడి నుంచి వివిధ ప్రాంతాలకు ప్రయాణించేవారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పనులు సాగుతున్నట్లు ఆయన చెప్పారు. 2025 నవంబర్ నాటికి ఈ పనులు పూర్తవుతాయన్నారు. అదే సమయంలో చర్లపల్లి టెర్మినల్ పనులు కూడా వేగంగా సాగుతున్నాయి. అది కూడా త్వరలో పూర్తవుతుంది. చర్లపల్లి టెర్మినల్ ప్రారంభానికి ప్రధాని నరేంద్ర మోదీని ఆహ్వానిస్తామని కిషన్ రెడ్డి తెలిపారు.
అలాగే రీజినల్ రింగ్ రోడ్ పూర్తయితే ఆ ప్రాంతాల వద్ద కొత్తగా రైల్వే స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు. ఆయా ప్రాంతాల్లో 22 లిఫ్టులు 30కి పైగా ఎస్కలేటర్లు అందుబాటులోకి రానున్నాయి. ప్రయాణీకులు నేరుగా స్టేషన్లోకి ప్రవేశించడానికి, బయటకు వెళ్లడానికి ఫుట్ ఓవర్ బ్రిడ్జిల నిర్మాణం కూడా జరుగుతుందని కేంద్ర మంత్రి చెప్పారు.