రూ.500 గ్యాస్ సిలిండర్ పథకానికి తెల్ల రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకుంటామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. తెల్ల రేషన్ కార్డు ఉన్న మహిళలకే గ్యాస్ సబ్సిడీ వర్తించనుంది. ప్రజా పాలనలో గ్యాస్ సబ్సిడీ కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో తెల్ల రేషన్ కార్డు ఉన్న మహిళలకు రూ.500లకే సిలిండర్ అందించనున్నట్లు తెలిపింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం జీవో విడుదల చేసింది.
పేద కుటుంబాలను ఆదుకోవడం, వంటింట్లో పొగ బారిన పడి అనారోగ్యానికి గురయ్యే ముప్పు నుంచి మహిళలను తప్పించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొంది. రాష్ట్రంలోని మొత్తం 1.20కోట్ల గ్యాస్ కనెక్షన్లలో రేషన్ కార్డు ఉన్న కుటుంబాల సంఖ్య 89.99 లక్ష్యమని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. గ్యాస్ సిలిండర్ పై సబ్సిడీ మొత్తాన్ని నెలనెలా ప్రభుత్వం ఆయా కంపెనీలకు చెల్లించనుంది. గ్యాస్ కంపెనీలు లబ్దిదారుల ఖాతాలకు ఆ మొత్తాన్ని బదిలీ చేయనున్నాయి.