సైబర్ నేరాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. బంజారాహిల్స్ లోని ఓ నిర్మాణ సంస్థ మెయిల్ను హ్యాక్ చేసిన సైబర్ నేరగాళ్లు రూ.64.11 లక్షలు స్వాహా చేశారు. ఆ సంస్థ ప్రతినిధుల ఫిర్యాదుతో హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు కేసు నమోదు చేశారు. నగరంలో ఓ నిర్మాణ సంస్థకు ఔటర్ హార్బర్ నిర్మించేందుకు ఇండియన్ నేవీ నుంచి కాంట్రాక్టు వచ్చింది. అయితే ఆ సంస్థ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించాలంటూ రెండు విదేశీ సంస్థలను కొద్ది రోజుల క్రితం నిర్మాణ సంస్థ సంప్రదించింది. దానికి లండన్కు చెందిన ఓ సంస్థ ముందుకొచ్చింది.
దానిలో భాగంగా ఆ నిర్మాణ సంస్థ కొద్ది రోజుల క్రితం లండన్ సంస్థ ఖాతాలో రూ.64.11 లక్షలను జమ చేసింది. రెండు రోజుల క్రితం లండన్ సంస్థ ప్రతినిధులు ఫోన్ చేసి ‘‘మీరు ఇంకా డబ్బు ఎందుకు పంపలేదని ప్రశ్నించారు. దీంతో నిర్మాణ సంస్థ ప్రతినిధులు షాక్ అయ్యారు. తమ మెయిల్ హ్యాక్ చేసి ఎవరో డబ్బులు కాజేశారని గ్రహించారు. సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దిల్లీ కేంద్రంగా కొందరు నైజీరియన్లు హైదరాబాద్లోని ప్రముఖ కార్పొరేట్ కంపెనీల మెయిల్స్ హ్యాక్ చేస్తున్నారని, నిర్మాణ సంస్థతో పాటు, లండన్ సంస్థ మెయిల్స్ ను వారు హ్యాక్ చేసి డబ్బులు కాజేశారని పోలీసులు నిర్ధారణకు వచ్చారు.