”పదేళ్లుగా హైదరాబాద్, పరిసర ప్రాంతాలు వేగవంతంగా అభివృద్ధి చెందుతున్నాయి.. ఇది ఎవరూ కాదనలేని విషయం. అయితే కాంగ్రెస్ గెలిస్తే హైదరాబాద్ రియాల్టీ పల్టీలు కొట్టడం ఖాయం.. అని అధికార బీఆర్ఎస్ చేస్తున్న ప్రచారంలో నిజానిజాలేంటీ?”
తెలంగాణాలో వారం రోజులలో ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ అంశం కూడా ఒక ప్రధాన ప్రచార అస్త్రంగా మారింది. బిఆర్ఎస్ పార్టీ కి చెందిన కీలక నేతలు, మంత్రులు కేటీఆర్, హరీష్ రావు లు ఇదే అంశాన్ని పదే పదే ప్రస్తావిస్తున్నారు కూడా. వాళ్ళు చెప్పేది ఏమిటి అంటే కాంగ్రెస్ అధికారంలోకి వస్తే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ పడిపోతుంది అని. గత పదేళ్ల కాలంలో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ గతంలో లేని విధంగా అసాధారంగా పెరిగింది. ప్రభుత్వమే ఇందుకు కారణం అనే విమర్శలు కూడా ఉన్నాయి. కొద్ది నెలల క్రితం ప్రభుత్వం వేసిన వేలంలో కూడా ..కొంత మందితో అస్మదీయ సంస్థలతో కుమ్మక్కు అయి రేట్లను కృత్రిమంగా పెంచినట్లు వార్తలు కూడా వచ్చిన విషయం తెలిసిందే. ఇది ఇలా ఉంటే మరో వైపు గత ఏడాదికి పైగా హైదరాబాద్ మార్కెట్ లో అమ్ముడు పోని అపార్ట్ మెంట్స్ (ఇన్వెంటరీ) లక్షన్నార పైనే ఉన్నట్లు రియల్ ఎస్టేట్ కన్సల్టింగ్ సంస్థలు వెల్లడించిన విషయం తెలిసిందే. ఇప్పుడు కూడా ఇంకా అదే పరిస్థితి ఉంది అని ఈ రంగంలోని నిపుణులు చెపుతున్నారు. మరి బిఆర్ఎస్ నాయకులు ప్రచారం చేస్తున్నట్లు ఒక వేళ తెలంగాణాలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రియల్ ఎస్టేట్ మార్కెట్ పడిపోతుంది అనే వాదనలో హేతుబద్దత ఉందా? …నిజంగానే అలా జరుగుతుందా అంటే ఆ అవకాశాలు ఏ మాత్రం లేవు అని ఈ రంగంలోని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. హైదరాబాద్ నగరం అభివృద్ధి అనేది ఇప్పటికే టేక్ ఆఫ్ అయిన విమానం వంటిది అని…దాన్ని అలా వదిలేసినా కూడా ముందుకు సాగుతుంది తప్ప..దీనికి ఏ మాత్రం ఢోకా ఉండదు అని తేల్చిచెపుతున్నారు. దేశంలోని కీలక నగరాలకు గంటల్లో, విదేశాలకు వెళ్లేందుకు అవసరమైన ఎయిర్ కనెక్టివిటీ, ఔటర్ రింగ్ రోడ్, మెట్రో రైల్ వంటి మౌలిక సదుపాయాలు నగరంలో ఉన్నందున ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కు ఎలాంటి ఇబ్బంది ఉండదు అని చెపుతున్నారు.