మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్యలో కీలక సూత్రదారులు, పాత్రధారులు త్వరలో బయటకు వస్తారా? సీబీఐ ఈ వ్యవహారాన్ని రోజుల వ్యవధిలోనే తేల్చేస్తుందా? సూత్రధారిగా సీబీఐ ధ్రువీకరించిన కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని ఇప్పటికే రెండు దఫాలు విచారించిన సీబీఐ తమ దర్యాప్తు పై వస్తున్న విమర్శలపై ఇంక జాప్యం చేయకుండా తేల్చడానికి నార్కో టెస్ట్ కు సిద్ధమవుతోందా? అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర రెడ్డి తదితరులకు నార్కో టెస్ట్ చేయడానికి కోర్టు లో అనుమతి కోసం పిటిషన్ వేసే పనిలో ఉన్నట్లు సమాచారం.
సునీత పోరాటం వల్లే ప్రాణాలు కాపాడే వృత్తిలో ఉన్న డాక్టర్ సునీత కన్నతండ్రినే చంపుతారని జగన్ అండ్ కో చెబితే నమ్మగలమా? జగన్కు ఈ కేసులో పక్షపాతం ఉండి ఉండకపోతే ఆయన సొంత పత్రికలో సీబీఐ అఫిడవిట్స్ గానీ, డాక్టర్ సునీత పోరాటం గురించి గానీ, ఒక్క ముక్క కూడా ఎందుకు ప్రచురించడం లేదో చెప్పాలి. ఆ పని చేయకపోగా అవినాశ్రెడ్డి అండ్ కోను కాపాడటానికి జగన్ మీడియా శక్తి వంచన లేకుండా కృషి చేస్తోంది. దీనినిబట్టి వివేకా హత్యకేసులో జగన్రెడ్డి దంపతులు వాస్తవాలను మరుగుపరిచారని స్పష్టమవుతోంది. సీబీఐ విచారణ నిష్పక్షపాతంగా మరింత ముందుకు సాగితే జగన్ దంపతులు కూడా ఈ కేసులో నిందితులుగా నిలబడాల్సి రావచ్చు. ఈ కారణంగానే సజ్జల శుక్రవారం మాట్లాడుతూ జగన్రెడ్డి వైపు కేసు మళ్లించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ముందుగానే చెప్పుకొచ్చారు. వివేకా హత్యకేసులో అంతిమంగా ఏం జరుగుతుందో తెలియదు కానీ, డాక్టర్ సునీత పోరాట పటిమ మాత్రం మహిళా జాతికే స్ఫూర్తి. తాను ఒంటరి పోరాటం చేస్తున్నానని భయపడకుండా, ఆమె ఎక్కడా వెనకడుగు వేయకుండా తన తండ్రి హత్యతో సంబంధం ఉన్నవారందరినీ ముద్దాయిలుగా చట్టం ముందు నిలబెట్టగలిగింది.
జగన్ సీబీఐని ఎందుకు వద్దన్నారు? వివేకా హత్య జరిగినపుడు సీబీఐ విచారణకు డిమాండ్ చేసిన జగన్ మోహన్ రెడ్డి.. సీఎం అయిన తర్వాత సీబీఐ వద్దని ఎందుకు పిటిషన్ వేయించారు? వివేకా కూతురు సునీత రెడ్డి పోరాడి సీబీఐ దర్యాప్తు నకు పట్టుపడుతుంటే ఎందుకు అడ్డుపడ్డారు? ఇలాంటి అనుమానాలు జగన్ అండ్ కో పై మరింత ఆజ్యం పోశాయి.
అవినాశ్కు జగన్ అండదండలు!
వైఎస్ వివేకానందరెడ్డి హత్యోదంతంపై జగన్ అండ్ కో తీసుకున్న వైఖరి అనుమానాలకు తావిస్తోంది. ఈ హత్యకు ప్రధాన సూత్రధారులలో ఒకరైన వైఎస్ అవినాశ్రెడ్డిని సీబీఐ అధికారులు శుక్రవారం రెండో పర్యాయం విచారించిన తర్వాత జగన్ అండ్ కో తమ నిజస్వరూపాన్ని బయటపెట్టుకుంది. విచారణ ముగిసిన తర్వాత అవినాశ్రెడ్డి హైదరాబాద్లో ఏం చెప్పారో తాడేపల్లిలో సజ్జల రామకృష్ణారెడ్డి కూడా దాదాపుగా అదే చెప్పారు. దీన్నిబట్టి అవినాశ్కు జగన్ అండదండలు పుష్కలంగా ఉన్నాయని స్పష్టమవుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో తనది రాజకీయాలకు అతీతమైన బంధమని జగన్రెడ్డి ఒకవైపు చెప్పుకొంటూనే మరోవైపు చంద్రబాబు చెప్పినట్టుగా సీబీఐ వ్యవహరిస్తోందని సజ్జల రామకృష్ణారెడ్డితో చెప్పించడంలో హాస్యాస్పదంగా ఉంది. వివేకా హత్యతో అవినాశ్కు, ఆయన తండ్రి వైఎస్ భాస్కర్రెడ్డికి సంబంధం ఉందని తేలిపోయినా సీబీఐ కొంతకాలం పాటు అడుగు ముందుకు వేయలేదు. కేంద్రంలోని బీజేపీ పెద్దలకు ముఖ్యమంత్రి జగన్పై మొహం మొత్తిందేమో తెలియదు కానీ, ఇటీవల ఆ కేసులో సీబీఐ చురుకుగా వ్యవహరిస్తోంది. వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ జరగకూడదని జగన్మోహన్ రెడ్డి మాత్రమే కోరుకున్నారు. తర్వాత వద్దనుకున్నారు. రాష్ట్ర పోలీసులతో విచారణ జరిపించి ఉంటే వివేకా హత్య కేసులో ఆయన కుమార్తె డాక్టర్ సునీత, అల్లుడు రాజశేఖరరెడ్డిని ఇరికించి శత్రుశేషం లేకుండా చేసుకునే స్కెచ్ అయి ఉంటుంది. డాక్టర్ సునీత అకుంఠిత పోరాట పటిమ వల్లసీబీఐ విచారణకు హైకోర్టు ఆదేశించడం, అసలు నిందితులు వెలుగులోకి వచ్చారు. ఇప్పుడే అందరి కళ్లు తాడేపల్లి ప్యాలెస్ వైపే చూస్తున్నాయి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దంపతులకు అంతా తెలుసు అని స్పష్టమైపోయింది. దీంతో కలుగులోంచి బయటకు వచ్చిన సజ్జల వితండవాదానికి తెర తీశారు. న్యాయస్థానం అనుమతితోనే దస్తగిరి అప్రూవర్గా మారారు. న్యాయమూర్తికి తెలియని చట్టం, సజ్జలకు మాత్రమే తెలిసిన చట్టమేమిటో ఆయనే చెప్పాలి. అవినాశ్రెడ్డిని అరెస్టు చేస్తే అది దుర్మార్గమవుతుందని సజ్జల అంటున్నారంటే వివేకా హత్యకేసులో అవినాశ్కు సంబంధం ఉందని సజ్జల అంగీకరిస్తున్నారన్న మాట. నిజానికి అవినాశ్ను అరెస్ట్ చేస్తామని సీబీఐ అధికారులు ఇంతవరకు ప్రకటించలేదు. తమ ప్రభుత్వం ఏర్పాటుచేసిన సిట్ ఇచ్చిన నివేదిక ఆధారంగానే సీబీఐ విచారణ జరపాలని సజ్జల కోరుతున్నారంటే సీబీఐ రంగంలోకి వస్తుందని ఊహించని జగన్ అండ్ కో వివేకా హత్య కేసును మరెవరి మెడకో చుట్టే ప్రయత్నం అప్పటికే పూర్తిచేశారని భావించాలీ.