యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నకిలీ వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఓ డయాబెటిక్ మందును కొనుగోలు చేయాలని అందులో డీప్ ఫేక్ టెక్నాలజీతో ఈ వీడియోను సృష్టించారని, గుర్తుతెలియని వ్యక్తులపై కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నామని యూపీ పోలీసులు తెలిపారు. ఈ వీడియోలో యోగి ఆదిత్యనాథ్ నకిలీ మందులను ప్రోత్సహిస్తున్నట్లుగా ఉందని చెప్పారు. టెక్నాలజీని ఇలా దుర్వినియోగం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు.
మధుమేహ బాధితుల కోసం తయారుచేసిన మందును కొనుగోలు చేయాలని సూచిస్తున్నట్లు గుర్తుతెలియని వ్యక్తులు ఈ వీడియోను రూపొందించారు. హజ్రత్గంజ్ ఇన్స్పెక్టర్ ఫిర్యాదుతో సైబర్ క్రైం పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పెరుగుతున్న మార్ఫింగ్ వీడియోలపై సెలబ్రెటీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రష్మిక మందన్నా, విరాట్ కోహ్లీ, సచిన్ టెండూల్కర్ తదితర ప్రముఖుల వీడియోలు ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ గా మారిన విషయం తెలిసిందే.