ఆర్థికంగా తీవ్ర ఇబ్బందుల్లో పడి, నిత్యావసరాల కొరతతో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకంలో సంక్షోభం మరింత ముదిరింది. ప్రజల ఆగ్రహం పతాక స్థాయికి చేరడంతో కర్ఫ్యూ ఆంక్షలు తొలగించిన వెంటనే మళ్లీ నిరసనకారులు శనివారం రోడ్లపైకి వచ్చారు. వారిని నియంత్రించేందుకు పోలీసులు గాలిలోకి కాల్పులు సహా చేసిన ప్రయత్నాలు ఏమాత్రం ఫలించలేదు. పరిస్థితి పూర్తిగా అదుపు తప్పడంతో దేశం నలుమూలల నుంచి లక్షలాదిగా కొలంబో తరలివచ్చిన ఆందోళనకారులు అధ్యక్షుడి అధికారిక నివాసాన్ని, కార్యాలయాన్ని ఆక్రమించుకున్నారు. అయితే అప్పటికే అధ్యక్షుడు గొటబాయ రాజపక్స ఈ పరిస్థితిని ముందుగానే ఊహించి అక్కడినుంచి పారిపోయినట్టు వార్తలు వస్తున్నాయి. ఆయన ఎక్కడున్నారో ప్రస్తుతం ఎవరికీ తెలియడం లేదు.
కాగా ఎస్ఎల్ఎన్ఎస్ సిందురాలా, ఎస్ఎల్ఎన్ఎస్ గజబాహు నౌకలు ఎక్కి కొందరు వ్యక్తులు కొలంబో పోర్టును వీడినట్టు అక్కడి అధికారులు చెపుతున్నారు. అంతకుముందే ఈ నౌకల్లోకి భారీ సరంజామా ఎక్కించినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అధ్యక్షుడు గొటబాయ రాజపక్స శ్రీలంక వదిలి పరారైనట్టు అనుమానిస్తున్నారు. ఆగ్రహం పట్టలేని నిరసనకారులు ప్రధాని రణిల్ విక్రమ్సింఘే ఇంటికి కూడా నిప్పు పెట్టారు. ప్రస్తుత పరిస్థితుల నుంచి దేశాన్ని బయటపడవేసేందుకు అఖిల పక్ష ప్రభుత్వం ఏర్పాటుకు అనుకూలంగా ఆయన రాజీనామా చేసిన కొన్ని గంటల్లోనే ఆయన ఇంటిపైనా దాడి జరిగింది. నిజానికి దేశాన్ని కష్టాల నుంచి గట్టెక్కించేందుకు రణిల్.. భారత్ సహా అంతర్జాతీయ సహాయం కోసం శక్తివంచన లేకుండా ప్రయత్నాలు చేస్తున్నారు. భారత్ నుంచి అందిన సహాయంతోనే నెట్టుకు వస్తున్నారు. అయితే అవినీతి, అరాచక పాలనతో శ్రీలంక సంక్షోభానికి కారణమైన రాజపక్స కుటుంబీకులు మాత్రం దేశం వీడి తమదారి తాము చూసుకుంటున్నారు.