శ్రీలంకలో సంక్షోభం నేపథ్యంలో హింసాత్మక సంఘటనలు జరిగాక మాజీ అధ్యక్షుడు గొటబాయ రాజపక్సకు చుక్కెదురయింది. ప్రజాగ్రహానికి భయపడిన ఆయన కుటుంబ సభ్యులతో సహా మాల్దీవులకు పారిపోయారు. అక్కడి నుంచి సింగపూర్ చేరారు. సింగపూర్ నుంచి ఈ మెయిల్ ద్వారా తన రాజీనామాను శ్రీలంక స్పీకర్ కు పంపించారు. దీన్ని ఆమోదించడంతో ఆయన ఇప్పుడు మాజీ అధ్యక్షుడు అయ్యారు. అయితే రాజపక్సకు ఎక్కువ రోజులు ఆశ్రయం ఇచ్చేందుకు సింగపూర్ సుముఖంగా లేదు. అతడు ఉండడానికి సింగపూర్ 15 రోజుల సమయాన్ని మాత్రమే ఇచ్చింది. దాన్ని పొడిగించే అవకాశం లేదని, మరో మార్గం చూసుకోవాలని రాజపక్సకు సింగపూర్ అధికారులు స్పష్టం చేసినట్టు సమాచారం. సింగపూర్ ఇచ్చిన 15 రోజుల తాత్కాలిక ఆశ్రయం తర్వాత ఏమి చేయాలన్న దానిపై గొటబాయలో స్పష్టత లేదని తెలుస్తోంది. ఆశ్రయం కోసం ఆయన భారత్ ను సైతం సంప్రదించినట్టు తెలుస్తోంది. అయితే శ్రీలంక ప్రజల అభిమతానికి వ్యతిరేకంగా గొటబాయ రాజపక్సకు ఆశ్రయం ఇచ్చేందుకు భారత్ నిరాకరించినట్టు సమాచారం.