ఆంధ్రప్రదేశ్, పశ్చిమ ఆస్ట్రేలియా (డబ్ల్యూఏ) మధ్య పెట్టుబడులే లక్ష్యంగా విశాఖ నగరంలో శనివారం ‘వ్యూహాత్మక భాగస్వామ్య సదస్సు’ జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, ఐటీ–పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ పాల్గొన్నారు. పశ్చిమ ఆస్ట్రేలియా తరఫున డిప్యూటీ ప్రీమియర్ రోజర్ కుక్, అంతర్జాతీయ విద్య, కల్చరల్ మంత్రి డేవిడ్ టెంపుల్మేన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా.. ఏపీని సిస్టర్ స్టేట్గా గుర్తించడంతోపాటు ఈ బంధాన్ని మరింత బలోపేతం చేయడం.. పెట్టుబడులు పెట్టేందుకు సాంకేతిక సహకారం, నైపుణ్యం అందించే అంశాలపై రెండు ప్రాంతాల ప్రతినిధులు చర్చించారు. పరిశ్రమలు, అంతర్జాతీయ విద్య, గనులు వంటి అంశాలపై వేర్వేరుగా సెషన్లు నిర్వహించారు. ఏపీ, ఆస్ట్రేలియాలో ఉన్న అవకాశాలపై చర్చించారు. అనంతరం జరిగిన వ్యూహాత్మక సదస్సులో పలు అంశాలపై పరస్పర అవగాహన ఒప్పందాలు (ఎంవోయూ)లు కుదుర్చుకున్నారు.
స్కిల్ డెవలప్మెంట్ జరిగితే.. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. అందుకే మల్టీనేషనల్ ఏజెన్సీల సహకారంతో అడుగులు వేస్తున్నామని ఆర్థిక మంత్రి బుగ్గన చెప్పారు. అంతర్జాతీయ విద్య విషయంలోనూ రాష్ట్రం పురోగమించింది. గడిచిన మూడేళ్ల నుంచి రాష్ట్ర జీడీపీ రేటు వృద్ధి చెందుతోంది. వాణిజ్య రంగంలో ఎప్పటికప్పుడు మౌలిక సదుపాయాలు ఆధునీకరించుకుంటూ అడుగులు వేస్తున్నాం అన్నారు.
ఈ సదస్సు భారత్–పశ్చిమ ఆస్ట్రేలియా మధ్య బంధం మరింత బలోపేతం అయ్యేందుకు గొప్ప అడుగు. రాబోయే ఇరవై ఏళ్లలో ఇరు ప్రాంతాల మధ్య మార్కెట్ వృద్ధి అవకాశాలు మరింత పెరగనున్నాయి. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఫలితాల్లో రాష్ట్రం నంబర్వన్ స్థానంలో నిలిచిందని . అదేవిధంగా ఏపీ, ఆస్ట్రేలియా మధ్య వాణిజ్య కార్యకలాపాల వృద్ధి 69.08 శాతంగా ఉందని ఐటీ–పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ అభిప్రాయపడ్డారు. మెరైన్ ఉత్పత్తుల ఎగుమతి దిగుమతుల కోసం రాష్ట్రంలో కొత్తగా నాలుగు పోర్టులు, తొమ్మిది ఫిష్ ల్యాండింగ్ సెంటర్లని ఏర్పాటుచేస్తున్నామని వెల్లడించారు. ఐటీ రంగంలో పెట్టుబడులకు ఏపీలో మంచి అవకాశాలున్నాయి. భూములూ సిద్ధంగా ఉన్నాయి. బీచ్ ఐటీ కాన్సెప్ట్తో ఐటీ పరిశ్రమలకు మంచి వాతావరణాన్ని అందిస్తున్నాం అని పేర్కొన్నారు.