ఒకపక్క దేశంలో నరేంద్రమోదీ- అమిత్షా జోడీ ఆధ్వర్యంలో బీజేపీ అప్రతిహతంగా విస్తరిస్తూ ఉండగా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారుతోందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఇటీవల ఈశాన్య రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ఆ పార్టీకి నిరాశనే మిగిల్చాయి. అయితే ఇదే సమయంలో అనూహ్యంగా వెస్ట్బెంగాల్, మహారాష్ట్రల్లో జరిగిన ఉపఎన్నికల్లో ఆ పార్టీ రెండు అసెంబ్లీ సీట్లను గెలుచుకుంది. బెంగాల్లోని సాగర్థిఘి నియోజకవర్గంలో జరిగిన ఉపఎన్నికల్లో సీపీఐఎం మద్దతుతో కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించింది. గడచిన ఐదు దశాబ్దాలుగా ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గెలవడం ఇదే మొదటిసారి. అంతేకాదు.. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో కమ్యూనిస్టు పార్టీతో పొత్తున్నా అంతకుముందెన్నడూ లేనివిధంగా అసెంబ్లీలో ప్రాతినిధ్యమే లేని స్థాయికి కాంగ్రెస్పార్టీ దిగజారింది. ఈ దుస్థితి ఆ రాష్ట్రంలో కాంగ్రెస్కి అదే తొలిసారి కావడం గమనార్హం.
ఈనేపథ్యంలో ఇప్పుడు బైపోల్ ఫలితం ప్రత్యేక ప్రాధాన్యం సంతరించుకుంది. బెంగాల్లో కాంగ్రెస్ పార్టీ ఉనికిని చాటిన ఫలితమిది. కాగా మరో కీలక రాష్ట్రమైన మహారాష్ట్రలో జరిగిన ఉపఎన్నికలో బీజేపీకి కంచుకోట లాంటి కాస్బా అసెంబ్లీ స్థానంలో కాంగ్రెస్ పార్టీ జయకేతనం ఎగురవేసింది. మహావికాస్ అఘాడీ కూటమి తరపున కాంగ్రెస్ అభ్యర్థి ఇక్కడ గెలిచారు. దాదాపు 28 సంవత్సరాల తర్వాత ఇక్కడ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరింది.
ఇక దేశంలో కాంగ్రెస్ పార్టీకి జవజీవాలు నింపి పునర్వైభవం దిశగా నడిపించేందుకు ఆ పార్టీ యువనేత రాహుల్గాంధీ చేపట్టిన భారతజోడో యాత్ర తొలిదశ విజయవంతంగా ముగిసిన విషయం తెలిసిందే. రెండోదశను ప్రారంభించేందుకు త్వరలోనే సిద్ధమవుతున్నట్టు ఆ పార్టీ వర్గాలు చెపుతున్నాయి. అయితే ఈ యాత్ర.. పార్టీ బలోపేతం అయ్యేందుకు ఏమేరకు ఉపయోగపడనుందో తెలియదుగానీ బీజేపీయేతర బలమైన రాజకీయ పక్షాల్లో కలవరం కలిగిస్తున్నట్టు కనిపిస్తోంది.
బెంగాల్లో కాంగ్రెస్కు వ్యతిరేకంగా దీదీ..
బెంగాల్ ఉపఎన్నికలో కాంగ్రెస్ గెలుపు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతాబెనర్జీకి ఏమాత్రం రుచించలేదు. కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకువెళ్లి తృణమూల్ కాంగ్రెస్ పార్టీని స్థాపించిన ఆమె అక్కడి కమ్యూనిస్టు పార్టీ ప్రభుత్వంపై మడమ తిప్పని పోరాటం సాగించి అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. దశాబ్దాలపాటు తిరుగులేని అధికారం చలాయించిన కమ్యూనిస్టు పార్టీ ఇప్పుడక్కడ ఉనికి కోసం పోరాడుతుండగా బీజేపీ ప్రధాన ప్రతిపక్షంగా ఎదిగింది. ఇప్పుడు అక్కడ కాంగ్రెస్ పార్టీ అక్కడ ఏమాత్రం బలం పుంజుకున్నా ఆ పార్టీ చీల్చే ఓట్లతో మమతా బెనర్జీకే నష్టం. అలాగని కాంగ్రెస్తో జట్టు కట్టేందుకు ఆమెకు ససేమిరా ఇష్టంలేదు. అందుకే ఆమె బీజేపీకి సహకరించి తనను ఓడించేందుకు కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు కుట్ర చేస్తున్నాయని విమర్శలకు దిగారు.
ఉత్తరప్రదేశ్లో వారు కలిస్తేనే ఉనికి..
కాగా ఢిల్లీ పీఠాన్నిచేజిక్కించుకోవాలంటే కీలకమైన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ ప్రభ వెలిగిపోతుండగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ చరిత్ర గతవైభవంగా మిగిలింది. ఇక్కడ కూడా కాంగ్రెస్ పుంజుకుంటే తమ ఉనికికే ముప్పని అటు సమాజ్వాది పార్టీ అధినేత అఖిలేష్యాదవ్, ఇటు బీఎస్పీ అధినేత్రి మాయావతి బలంగా నమ్ముతున్నారు. అందుకే వారు కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఉన్న రాజకీయ కూటమిలో తాము చేరబోమని ఇప్పటికే స్పష్టంగా ప్రకటించారు.
తెలంగాణలోనూ సవాళ్లే..
ఇక కాంగ్రెస్కు క్షేత్రస్థాయిలో ఇప్పటికీ బలమున్న తెలంగాణలోనూ అంత అనుకూల పరిస్థితులేమీ లేవు. ఇక్కడ బీజేపీ శరవేగంగా ఎదుగుతూ వచ్చే ఎన్నికల్లో గెలుపు తనదేనంటోంది. ఇక్కడ అధికారంలో ఉన్న కేసీఆర్ ఏకంగా తన టీఆర్ఎస్ పార్టీని జాతీయపార్టీకి విస్తరించి బీఆర్ఎస్ గా మార్చి బీజేపీకి ప్రత్యామ్నాయంగా ఎదుగుతామంటూ మూడో కూటమి కోసం పావులు కదుపుతున్నారు.
కలిసివచ్చేది వీరే..
ప్రస్తుత తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత స్టాలిన్, ఎన్సీపీ అధినేత శరద్పవార్, ఉద్దవ్థాకరే తోపాటు మరికొందరు మాత్రమే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీతో సయోధ్య నెరుపుతున్నారు. ఈనేపథ్యంలో జాతీయస్థాయిలో బీజేపీకి ప్రత్యామ్నాయంగా ఎదగడానికి బలమైన అడ్డంకులను అధిగమిస్తూ కాంగ్రెస్ పార్టీ చాలాదూరమే ప్రయాణించాల్సి ఉంది. రాహుల్గాంధీ విపక్షాలన్నింటినీ కలుపుకుని వెళ్లే ప్రయత్నంలో ఏమేరకు విజయవంతం కాగలరో చూడాల్సిఉంది.