తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనను అంతమొందించడానికి మునుగోడు ఉపఎన్నిక ఆరంభం అని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. ఆయన కేసీఆర్ పై ధ్వజమెత్తారు. మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా బీజేపీ నిర్వహించిన భహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. తెలంగాణ విమోచన దినోత్సవం విషయంలో కేసీఆర్ మాట తప్పారనేది అమిత్ షా ఆరోపణ. బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత విమోచన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తామని స్పష్టం చేశారు. కుటుంబ పాలన వల్ల తెలంగాణ నష్టపోతోందని… వచ్చే ఎన్నికల తర్వాత తెలంగాణలో బీజేపీ సీఎం ఉంటారని చెప్పుకొచ్చారు.
ప్రధాని రైతు బీమా పథకాన్ని తెలంగాణలో ఎందుకు అమలు చేయడం లేదని నిలదీశారు. కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ కుటుంబానికి ఏటీఎంలా మారిందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ ధరలను తగ్గించినా కేసీఆర్ ప్రభుత్వం మాత్రం తగ్గించలేదన్నారు. దళితుడిని సీఎం చేస్తానన్న కేసీఆర్ దళితులను మోసం చేశారని మండిపడ్డారు. జిల్లాకో సూపర్ స్పెషాల్టీ ఆసుపత్రిని నిర్మాస్తామని, పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఇస్తామని, గిరిజనులకు భూములు ఇస్తామని కేసీఆర్ చెప్పారు ఇవన్నీ జరిగాయా అని ప్రజలను అమిత్ షా ప్రశ్నించారు. మునుగోడులో రాజగోపాల్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని.. కేసీఆర్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకే రాజగోపాల్ రెడ్డి బీజేపీలోకి వచ్చారన్నారు.