మోదీ-అమిత్ షా ల చేతుల్లో ఉన్న బీజేపీని కాదని రాజకీయంగా మనుగడ సాగించడం కష్టం అని బలంగా విశ్వసిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆ పార్టీకి చేరువయ్యేందుకు ఉన్న దారులన్నింటినీ వెతుక్కుంటున్నారు. 2019 ఎన్నికల సమయంలో మోదీ ఆధ్వర్యంలో ఎన్డీయే ఓడిపోతుందని.. సోనియా సారథ్యంలో యుపిఏని సపోర్ట్ చేయడం ద్వారా తాను కేంద్రంలో చక్రం తిప్పవచ్చని భావించిన చంద్రబాబుకి సీన్ రివర్స్ అయింది. అంతే అప్పటి నుంచీ దారీ, తెన్నూ లేక బాబుగారి పరిస్థితి కుడితిలో పడిన ఎలుకలా తయారయింది.
రూటు చూసుకుంటున్నారు:
మరో ఏడాదిన్నరలో జరగబోయే ఎన్నికల నాటికి ఎలాగైనా బీజేపీతో స్నేహ హస్తం అందిపుచ్చుకోవాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకోసం ఈనాడు అధినేత రామోజీరావు ద్వారా ఇప్పటికే మధ్య వర్తిత్వం నెరపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. తెలంగానాలో అధికారంలోకి రావడానికి బీజేపీకి టీడీపీ పొత్తు ఉపయోగపడుతుందని, దీనిని అక్కడ ఉపయోగించుకుని.. ఆంధ్రాలో చంద్రబాబుకి ఛాన్స్ ఇస్తే రాజకీయంగా ఇరు పక్షాలకు మెరుగ్గా ఉంటుందన్నది రామోజీరావు సూచనగా చెప్తున్నారు. ఏపీలో జగన్ పై తీవ్ర వ్యతిరేకత వచ్చిన కారణంగా ఎలాగూ టీడీపీ కి సానుకూలత ఉంటుందని.. ఇదే సమయంలో జగన్ వంటి అవినీతి ఊబిలో కూరుకుపోయిన వారికి మద్దతు ఇవ్వడంలేదని సంకేతం ఇవ్వడం ద్వారా బీజేపీని దేశ వ్యాప్తంగా పునీతం చేసుకున్నట్లు కూడా అవుతుందని వీళ్ళ సలహా. చంద్రబాబుతో కలవడానికి మోదీ-షా లు ఇష్టపడతారో., లేక ఏం జరుగుతుందో కొన్నాళ్లు వేచి చూడాలి.