- పేదలు వినియోగించే ఏవస్తువుపైనా పన్ను వేయలేదు
రూపాయి విలువ చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో పతనం అయినప్పటికీ, కేంద్రప్రభుత్వం అసత్యపు ప్రవచనాలను వల్లె వేస్తున్నది. రూపాయి విలువ పతనం కాలేదని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ సాక్షిగా పేర్కొన్నారు. రూపాయి సహజ రీతిలోనే ముందుకు సాగుతున్నదని, దాని కదలికలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నిరంతరం దృష్టి పెడుతుందని చెప్పుకొచ్చారు. ఒడిదుడుకులను కట్టడి చేసేందుకు మాత్రమే ఆర్బీఐ జోక్యం చేసుకుంటుందని తెలిపారు. ఈ మేరకు రాజ్యసభలో విపక్ష సభ్యుల ప్రశ్నలకు సమాధానమిచ్చారు. ఇతర దేశాల తరహాలో ప్రభుత్వం గానీ, ఆర్బీఐ గానీ రూపాయి విలువ విషయంలో జోక్యం చేసుకోవడంలేదని నిర్మల ఈ సందర్భంగా తెలిపారు. దీర్ఘకాలంలో రూపాయి బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై ప్రభుత్వం, ఆర్బీఐ దృష్టి సారిస్తున్నదని వెల్లడించారు. ఇతర దేశాల కరెన్సీలతో పోలిస్తే రూపాయి బలంగానే ఉన్నదని తెలిపారు. అమెరికా ఫెడరల్ రిజర్వు నిర్ణయాల ప్రభావాన్ని ఇతర కరెన్సీల కంటే రూపాయే బలంగా ఎదుర్కోగలిగిందన్నారు. విదేశీ మారక నిల్వలపై ఆందోళనలు వద్దన్న నిర్మల.. జూలై 22 నాటికి 571.56 బిలియన్ డాలర్ల నిల్వలు ఉన్నాయన్నారు. ఇతర దేశాల్లో ద్రవ్యోల్బణాన్ని పోల్చుతూ.. ఆర్బీఐ, కేంద్రం చేసిన ప్రయత్నాల వల్లే భారత్లో ద్రవ్యోల్బణం రేటు 7 శాతంగా ఉందన్నారు.