టాలీవుడ్లో ప్రస్తుతం చురుగ్గా చిత్ర నిర్మాణం సాగిస్తున్న ప్రొడ్యూసర్ అనిల్ సుంకర. ఏకకాలంలో రెండు భారీ చిత్రాలను ఆయన ఆయన తన ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై నిర్మిస్తున్నారు. అందులో మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా మెహర్ రమేష్ దర్శకత్వంలో రూపొందుతున్న భోళా శంకర్ ఒకటి కాగా, అక్కినేని యువ హీరో అఖిల్ తో సురేందర్రెడ్డి దర్శకుడిగా తెరకెక్కిస్తున్న ‘ఏజెంట్’ మూవీ మరొకటి. ఈ రెండు చిత్రాలపైనా అటు ఇండస్ట్రీ వర్గాల్లోనూ ఇటు ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలున్నాయి.
తాజాగా అనిల్ సుంకర టాలీవుడ్లో మల్టీస్టారర్ చిత్రాల నిర్మాణంపై చేసిన వ్యాఖ్యలు అసక్తిని కలిగిస్తున్నాయి. స్టార్ హీరోలు కలిసి నటిస్తే అద్భుతాలు సాధ్యమవుతాయని, ప్రేక్షకుల నుంచి అలాంటి చిత్రాలకు బ్రహ్మాండమైన ఆదరణ లభిస్తుందని చెప్పిన ఈ నిర్మాత తనకు కూడా ఇలాంటి చిత్రాలంటే ఎంతో ఇష్టమని తెలిపారు. టాలీవుడ్లో బాలకృష్ణ- చిరంజీవి, పవన్కల్యాణ్- తారక్ వంటి క్రేజీ కాంబోల్లో చిత్రాల నిర్మాణం సాకారమైతే బాక్సాఫీసు వద్ద కొత్త రికార్డులు నమోదవుతాయన్నారు. ఇక అలాంటి చిత్రాల్లో సూపర్స్టార్ మహేష్ కూడా ఒక ప్రత్యేక పాత్రలో దర్శనమిస్తే ప్రేక్షకులకు పండగేనని, తనతోపాటు టాలీవుడ్లో పలువురు నిర్మాతలు ఇలాంటి మల్టీస్టారర్ చిత్రాల నిర్మాణానికి సిద్ధంగా ఉన్నట్టు అనిల్ సుంకర్ తెలిపారు. అయితే ఆ హీరోలకు ఒప్పించి మెప్పించగల కథలను దర్శకులు సిద్ధం చేయాలన్నారు. అనిల్ సుంకర కేవలం నిర్మాత మాత్రమే కాదు.. ఆయన గతంలో యాక్షన్3డి అనే చిత్రానికి దర్శకత్వం కూడా వహించారు. అంతేకాదు ఆయనలో రచయిత కూడా ఉన్నాడు.