రైల్వేశాఖ తీసుకుంటున్న నిర్ణయాలు పేద, మధ్యతరగతి ప్రజలకు, సీనియర్ సిటిజన్లకు భారంగా మారుతున్నాయి. రైళ్లలో వృద్ధులకు రాయితీని ఎత్తివేస్తామనడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతుండటంతో రైల్వేశాఖ నష్టనివారణ చర్యలు చేపట్టింది. అయితే, ఇక్కడ కూడా మరో తిరకాసు పెట్టింది. రైళ్లలో వృద్ధులకు రాయితీని పునరుద్ధరించే యోచనలో ఉన్నట్టు చెబుతూనే.. జనరల్, స్లీపర్ క్లాసుల్లో ప్రయాణించే 70 ఏళ్ళు పైబడిన వారికే ఈ రాయితీ వర్తిస్తుందని కొత్త మెలిక పెట్టింది. తాజా నిర్ణయం అమల్లోకి వస్తే, ఇప్పటివరకూ 58 ఏండ్లు పైబడిన మహిళలు, 60 ఏండ్లు పైబడిన పురుషులకు అందుతున్న రాయితీ ప్రయోజనాలు ఇకపై ఉండవు. కేవలం 70 ఏండ్లు దాటిన వృద్ధులకే టికెట్పై రాయితీ లభిస్తుంది. అది కూడా కేవలం నాన్-ఏసీ తరగతులకు మాత్రమే పరిమితం చేయాలని భావిస్తున్నట్టు సమాచారం.
ప్రీమియం వాత
ఆదాయం పెంచుకునేందుకు రైల్వేశాఖ మరో కసరత్తు ప్రారంభించింది. అన్ని రైళ్లలోనూ ప్రీమియం తత్కాల్ కోటాను ప్రవేశపెట్టాలని యోచిస్తున్నది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 80 రైళ్లలో మాత్రమే ప్రీమియం తత్కాల్ కోటా అమలవుతున్నది. తత్కాల్ కోటాతో పోలిస్తే ప్రీమియం తత్కాల్ కోటాలోని టికెట్ ధరలు ఎక్కువగా ఉంటాయి. ‘ప్రీమియం తత్కాల్ కోటా’ కింద కొన్ని టికెట్లను కేటాయిస్తారు. వీటికి డైనమిక్ షేర్ అమలవుతుంది. అంటే సీట్లు భర్తీ అవుతూ డిమాండ్ పెరుగుతున్న కొద్దీ.. టికెట్ ధర పెరుగుతూ వస్తుంది. చివరి నిమిషంలో బుక్ చేసుకునే టికెట్ రేట్లు చాలా ఎక్కువగా ఉంటాయి.