వరుస విజయాలతో కెరీర్ మొత్తం మీద అత్యున్నత దశలో ఉన్న సూపర్ స్టార్ మహేష్ తదుపరి సినిమాలు కూడా ఆయన స్థాయిని శిఖరాగ్రానికి తీసుకెళ్లే స్థాయిలోనే ఉండబోతున్నాయని చెప్పాలి. ముందుగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మూవీ, ఆ తరువాత రాజమౌళి- మహేష్ కాంబోలో తొలి మూవీ పట్టాలెక్కనున్న విషయం తెలిసిందే. కాగా ఇప్పుడు త్రివిక్రమ్- మహేష్ కాంబోలో రానున్న చిత్రానికి సంబంధించి ఆసక్తికరమైన వార్తలు బయటకు వస్తున్నాయి. ఇప్పటిదాకా మహేష్ కెరీర్లోనే అత్యధిక బడ్జెట్తో తెరకెక్కనున్న ఈమూవీలో ఓ కీలక పాత్రలో బాలీవుడ్ సీనియర్ హీరో అనిల్ కపూర్ నటించనున్నట్టు గతంలో వార్తలు రాగా, ఇప్పుడు ఆ పాత్రలో సీనియర్ కన్నడ హీరో రవిచంద్రన్ కనిపించబోతున్నట్టు పరిశ్రమ వర్గాల సమాచారం. ఇది కథానాయకుడి తండ్రి పాత్ర అని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో మహేష్ సరసన కథానాయికగా క్రేజీ హీరోయిన్ పూజా హెగ్డే నటిస్తున్న విషయం తెలిసిందే.
కాగా ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన తాజా అప్డేట్ ఏమిటంటే మహేష్ ఈ చిత్రంలో ద్విపాత్రాభినయం చేయబోతున్నాడట. ఇది పీరియాడికల్ డ్రామా కథాంశంగా రూపొందనుందని, ఫ్లాష్ బ్యాక్, లైవ్ సమానంగా సాగుతాయని తెలుస్తోంది. కాగా తండ్రి, కొడుకులుగా మహేష్ కనిపిస్తాడా..? మరో సీనియర్ హీరో నటిస్తారనుకున్న పాత్ర ఇదేనా..? అన్న విషయంపై చిత్రబృందం అధికారికంగా అనౌన్స్ చేస్తేనే కాని తెలియదు. జూలై రెండోవారం నుంచి ఓ భారీ యాక్షన్ సన్నివేశంతో ఈ సినిమా మొదటి షెడ్యూల్ మొదలుపెట్టేందుకు చిత్రబృందం సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది.