దశాబ్దాల క్రితమే దక్షిణాదినుంచి బాలీవుడ్కు వెళ్లి అక్కడ పలు సినిమాల్లో నటించి దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఘనత కమల్హాసన్ది. అయితే ఉత్తరాది హీరోల హవా కొనసాగుతున్న సమయంలో తన స్థాయికి తగిన పాత్రలు అక్కడ రావడం లేదని భావించి తిరిగి చెన్నైకు వచ్చి దక్షిణాది చిత్రాలకే పరిమితమయ్యారు. పలు చిత్రాల్లో విభిన్నమైన పాత్రలను పోషించడంతోపాటు, తనదైన శైలిలో కొన్నిచిత్రాలను నిర్మించి, దర్శకత్వ బాధ్యతలూ నిర్వహించారు. నటుడిగా, దర్శకుడిగా, కథారచయితగా బహుముఖ ప్రజ్ఞ ఆయన సొంతం.
అయితే కొన్నేళ్లుగా కమల్కు కాలం కలిసిరావడం లేదని చెప్పాలి. 2018లో వచ్చిన ‘విశ్వరూపం-2’ తరువాత ఆయన చిత్రమేదీ రాలేదు. ఈ మధ్య కాలంలో కమల్ కథానాయకుడిగా శంకర్ దర్శకత్వంలో ప్రతిష్టాత్మక ప్రాజెక్టుగా మొదలైన ‘భారతీయుడు-2’ షూటింగ్లో ప్రమాదం జరగడంతో ఆ చిత్రం చాలకాలం ఆగిపోవడం, ఆ తరువాత కోవిడ్ ప్రభావంతో ఇతర ప్రాజెక్టులూ నిలిచిపోవడం కమల్ అభిమానులకు తీవ్ర నిరాశను కలిగించాయని చెప్పాలి. అయితే ఇప్పుడు కమల్ నటించిన తాజా చిత్రం ‘విక్రమ్’ జూన్ 3న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది.
కమల్ సొంత బ్యానర్ రాజ్కమల్ ఫిల్స్మ్ ఇంటర్నేషనల్ పతాకంపై లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో భారీ యాక్షన్ థ్రిల్లర్గా తెరకెక్కిన ఈ చిత్రంలో కమల్తో పాటు విజయ్ సేతుపతి, ఫహాద్ ఫాజిల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలున్నాయి. విడుదలకు ముందుగానే శాటిలైట్, ఓటీటీ రైట్స్తో కలిపి రూ. 200 కోట్లకు పైగానే ఈ చిత్రం బిజినెస్ చేసి బాక్సాఫీసు వద్ద కమల్ క్రేజ్ ఇప్పటికీ తగ్గలేదని నిరూపించింది. ఇది ఆయన చిత్రాల్లోనే అత్యధిక మొత్తం కావడం విశేషం. మరోపక్క ‘భారతీయుడు-2’ చిత్రం కూడా వివాదాలు, అడ్డంకులను అధిగమించి షూటింగ్ పూర్తి చేసుకుని ఈ ఏడాది చివరినాటికి ప్రేక్షకులముందుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ రెండు చిత్రాలు అనుకున్న స్థాయిలో విజయవంతమైతే మళ్లీ వెండితెరపై లోకనాయకుడి హవా మొదలైనట్టేనని చెప్పాలి.