జక్కన్న రాజమౌళి వెండితెరపై మలిచిన బాహుబలి పాత్ర ఓ బ్రాండ్గా మారిపోయిన విషయం తెలిసిందే. దక్షిణాది దర్శకులను, హీరోలను ఒక్కసారిగా పాన్ ఇండియా స్థాయి చిత్రాల వైపు దృష్టి సారించేలా చేసిన చిత్రమిది. ఆ తరువాత ఆర్ఆర్ఆర్ చిత్రంతో మరో అద్భుతం సృష్టించాడీ దర్శక ధీరుడు. రియల్ మల్టీ స్టారర్ అంటే ఎలా ఉంటుందో చాలాకాలం తరువాత చూసిన ప్రేక్షకులు ఈ చిత్రానికి సంచలన విజయం చేకూర్చారు. ఈ చిత్రంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ కనబరచిన నటనకు దేశంలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు దక్కుతున్నాయి. అంతేకాదు.. ఈ చిత్రంలో నటించిన పాత్రల మాదిరిగానే నిజ జీవితంలో కూడా తారక్, రాంచరణ్ల మధ్య గట్టి స్నేహ బంధం కూడా ఏర్పడింది.
ఈ నేపథ్యంలోనే ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ ఆసక్తికరమైన వార్త చక్కెర్లు కొడుతోంది. అదేంటంటే ఆర్ఆర్ఆర్ బ్రాండ్తో ఓ రెస్టారెంట్ చెయిన్ మొదలుపెట్టేందుకు ఆలోచన చేస్తున్నారని, ఇందులో తారక్, చెర్రీలతో పాటుగా రాజమౌళి కూడా భాగస్వామిగా ఉండే అవకాశం ఉందనేది ఈ వార్త సారాంశం. టాలీవుడ్కు చెందిన ఓ ప్రముఖ ప్రొడ్యూసర్ ఈ ఆలోచనను తారక్, చెర్రీలతో పంచుకున్నాడని, అయితే వారు ప్రస్తుతం తమ భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉండటంతో దీనిపై ఇంకా ఏమీ తేల్చి చెప్పలేదని ఫిల్మ్ నగర్ వర్గాలను ఉటంకిస్తూ సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. అయితే రాజమౌళి మాత్రం సినిమాయేతర వ్యాపారాల్లో వేలు పెట్టేందుకు సుముఖంగా లేనట్టు తెలుస్తోంది. నిజానికి చెర్రీ ఇప్పటికే స్టార్ హీరోగా పేరు తెచ్చుకోవడంతో పాటు భారీ చిత్రాల నిర్మాతగాను వ్యవహరిస్తున్నారు. అంతేకాదు.. విమాన యాన రంగంలో సైతం పెట్టుబడులు పెట్టిన విషయం తెలిసిందే. తారక్ ప్రత్యక్షంగా వ్యాపారాల్లో లేకపోయినా ఆయన మామ నార్నే శ్రీనివాసరావు ప్రముఖ రియల్టర్. ఈ నేపథ్యంలో తారక్, చెర్రీ కలిసి వ్యాపారం మొదలు పెడతారనే వార్తలు సహజంగానే అటు ఇండస్ట్రీ వర్గాల్లోనూ, ఇటు వారి అభిమానుల్లోను ఆసక్తిని కలిగిస్తున్నాయి.