మన పొరుగు దేశమైన శ్రీలంక ఇటీవలి కాలంలో తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకోవడం, ప్రజలు ఆగ్రహంతో అక్కడి పాలకుల కార్యాలయాల పైనా నివాస భవనాల పైనా దాడులకు పాల్పడి విధ్వంసం సృష్టించడం చూస్తున్నదే. ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగిపోవడం, విదేశీమారక ద్రవ్యం హరించుకుపోవడంతో ప్రజలకు అవసరమైన స్థాయిలో చమురు ఉత్పత్తులు దిగుమతి చేసుకుని సరఫరా చేయలేక ప్రభుత్వం ఎప్పుడో చేతులెత్తేసింది. అంతేకాదు.. ఆహార ధాన్యాలకు, నిత్యావసరాలకు సైతం ద్వీప దేశంలో తీవ్ర కొరత ఏర్పడి సంక్షోభ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రజలు గతంలో ఎన్నడూ చవిచూడనివిధంగా పలు ఇక్కట్టు పడుతున్నారు. ఆ దేశంలో నెలకొన్న పరిస్థితులను గమనించి భారత్ ఇప్పటికే ఆహార ధాన్యాలతోపాటు, ఔషధాలు సహా దాదాపు 3 బిలియన్ డాలర్ల సహాయాన్ని ఇప్పటిదాకా అందించింది. అయినా పరిస్థితులు ఆశించినంతగా మెరుగుపడకపోవడంతో శ్రీలంక ప్రభుత్వం భారత్, చైనా, జపాన్తో పాటు అగ్రరాజ్యం అమెరికా నుంచి భారీగా సాయం అందించాలని కోరుతోంది. ఇందుకుగాను డోనర్ కాన్ఫరెన్స్ నిర్వహించాలని ఆ దేశ ప్రధాని విక్రమసింఘే నిర్ణయించారు.
సంక్షోభానికి కారణాలేమిటి..?
వాస్తవానికి వ్యవసాయంతో పాటు శ్రీలంకకు టూరిజం ప్రధాన ఆదాయ వనరు. 2019లో ఈస్టర్ పండుగనాడు జరిగిన బాంబు పేలుళ్లలో పలువురు చనిపోవడం, అల్లర్ల కారణంగా ఆ దేశ టూరిజం పరిశ్రమ బాగా దెబ్బతింది. ఆ తరువాత కోవిడ్ మహమ్మారి కారణంగా అన్ని దేశాల మాదిరిగానే శ్రీలంక ఆర్థిక వ్యవస్థ కూడా మరింత కుంగింది. ఇదే సమయంలో చైనా నుంచి దిగుమతి అవుతున్న ఎరువులు నాసిరకంగా ఉంటున్నాయన్న కారణంగా వాటితో ప్రమేయం లేకుండా పూర్తిగా సేంద్రియ వ్యవసాయంపై ఆధారపడాలని ప్రభుత్వం నిర్ణయించింది. దశలవారీగా సమగ్ర ప్రణాళికతో చేపట్టాల్సిన ఈ కార్యక్రమాన్నిపర్యవసానాలు అంచనా వేయకుండా ఒక్కసారిగా అమలు చేయడంతో అక్కడ వ్యవసాయ ఉత్పత్తుల దిగుబడులు భారీగా పడిపోయాయి. ఇవన్నీ ఏకమై దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపించడం ప్రస్తుత సంక్షోభానికి కారణం.
జాతుల పోరాటం కారణంగా చైనా వైపు మొగ్గిన లంక
దశాబ్దాలపాటు జాతుల సంక్షోభంతో రగిలిన శ్రీలంక ఆ సమయంలో లిబరేషన్ ఆఫ్ తమిళ టైగర్స్ ఈలం తీవ్రవాద సంస్థను ఎదుర్కోవడం కోసం భారత్ కు దూరంగా జరిగి చైనా వైపు మొగ్గింది. భారత్ను దిగ్బంధం చేసేందుకు ఇలాంటి అవకాశం కోసమే కాచుకుని ఉన్న చైనా శ్రీలంకకు ఆయుధ పరమైన సాయం అందించి ఆ సంస్థను నిర్మూలించడంలో సహకరించింది. దానికి ప్రతిగా హిందూ మహా సముద్రంలో పాగా వేసేందుకు చైనా వ్యూహ రచన చేసింది. శ్రీలంకకు రుణాల రూపంలో అందిస్తున్నట్టు నటిస్తూ ఆ దేశంలో పోర్టు నిర్మాణం చేసింది. ఆదేశంలో సైనిక స్థావరాలు ఏర్పాటు చేసుకుని ఇటు భారత్కు పక్కలో బల్లెంలా మారడంతోపాటు, అటు హిందూ మహా సముద్రంలోనూ తన ఆధిపత్యం చాటాలని ప్రయత్నించింది.
మరోపక్క ఆ దేశాన్ని రుణాల ఊబిలోకి నెట్టి తన ఉత్పత్తులకు మార్కెట్గా మలుచుకుని, శ్రీలంకను గుప్పిట పట్టే ప్రయత్నం చేసింది. చైనా కుటిల ప్రయత్నాలను కాస్త ఆలస్యంగా అర్థం చేసుకున్న శ్రీలంక.. చైనా కబంధ హస్తాల నుంచి తప్పించుకునే ప్రయత్నాల్లో భాగంగా మళ్లీ భారత్ సాయం అర్థించింది. ప్రస్తుతం శ్రీలంకకు భారత్ భారీ స్థాయిలో సాయం అందిస్తుండటానికి మానవతా కారణాలతో పాటు, పొరుగు దేశంలో చైనా ప్రాబల్యాన్ని నిరోధించాలన్న లక్ష్యం కూడా దాగి ఉంది.